Saturday, May 4, 2024

అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూపార్క్‌ అభివృద్ధి.. పెరగనున్న ఎంట్రీ ఫీజు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అటవీశాఖ మంత్రి ఆధ్వర్యంలో జపాట్‌ (జూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ) పాలక మండలి సమావేశం మంగళవారం నాడు హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో జరిగింది. నెహ్రూ జూపార్క్‌ పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా జంతు ప్రదర్శనశాలలను మరింత అభివృద్ది చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సమావేశంలో నిర్ణయించారు.

కాకతీయ జూ పార్క్‌ (హనుమకొండ), పిల్లలమర్రి మినీ జూపార్క్‌ (మహబూబ్‌నగర్‌), లోయర్‌ మానేరు డీర్‌ పార్క్‌ (కరీంనగర్‌), కిన్నెరసాని డీర్‌ పార్క్‌ (పాల్వం) జంతు సంరక్షణ ప్రదర్శన చర్యలు, కేబీఆర్‌, మృగవని, మహవీర్‌ హరిణ వసన్థలి, ఇతర అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ఈమేరకు సమావేశంలో చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్‌లో సౌకర్యాలను మెరుగు పరచాలని, వన్యప్రాణుల ఆవాసాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం, ఇంకా ఆకర్షణీయమైన జంతువులను దిగుమతి చేసుకోవటం, పులి, సింహాల ఎన్‌ క్లోజర్లను గ్లాస్‌ పార్టీషన్‌తో అతిదగ్గర నుంచి చూసే ఏర్పాటు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు.

- Advertisement -

నెహ్రూ జూ పార్క్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, మరింత వృద్దికి అవకాశాలపై క్యూరేటర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. నిపుణుల సూచనలతో వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్‌తో పాటు అన్ని జూపార్క్‌లు, నేషనల్‌ పార్క్‌లను, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లను పర్యావరణహితంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటు-లోకి తెస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఓఎఫ్‌) ఆర్‌ఏం డోబ్రియాల్‌ మంత్రికి వివరించారు.


ఎంట్రీ ఫీజు పెంపు…

పెరిగిన యాజమాన్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ జూ పార్క్‌ ఎంట్రీ ఛార్జీలను నామమాత్రంగా పెంచేందకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇకపై వారం రోజుల్లో పెద్దలకు రూ.70, సెలవు రోజుల్లో రూ.80, పిల్లలకు రూ.45, సెలవు రోజుల్లో రూ.55 రుసుముగా నిర్ణయించారు. జంతువులను దత్తత తీసుకుని, నిర్వహణ వ్యయాన్ని విరాళంగా ఇచ్చే సదుపాయాన్ని మరింతగా విస్తరించాలని పాలకమండలి తీర్మానించింది. మీరాలం ట్యాంక్‌ నుంచి జూ పార్క్‌లోకి వచ్చే నీటిని నియంత్రించడం, మిషన్‌ భగీరథ ద్వారా జంతువులకు తాగునీటి వసతిని సంబంధిత శాఖ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో జూ పార్క్‌ డైరెక్టర్‌ వినయ్‌ కుమార్‌, ఓఎస్డీ శంకరణ్‌, జపాట్‌ పాలకమండలి సభ్యులు, వివిధ జూ పార్క్‌లు, జాతీయ పార్కుల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement