Saturday, May 4, 2024

Delhi | శిష్ట కరణాలు, కళింగ కోమట్లను ఓబీసీల్లో చేర్చండి.. టీడీపీ నేత సత్యనారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శిష్ట కరణాలు, కళింగ కోమట్లను ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాద సత్యనారాయణ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌ను కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన బీసీ కమిషన్ సమావేశంలో పాల్గొన్న సత్యనారాయణ, ఈ రెండు సామాజికవర్గాల గురించి గతంలోనూ కేంద్ర ప్రభుత్వానికి పలు వినతి పత్రాలు అందజేసినట్టు గుర్తుచేశారు.

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి, ప్రధాన మంత్రికి తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు లేఖలు రాశారని, ఈ అంశంపై నేషనల్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఒక హియరింగ్ కూడా జరిగిందని తెలిపారు. ఈ అంశం చాలాకాలంగా పెండింగులో ఉందని, త్వరగా పరిష్కరించాలని ఎన్సీబీసీ ఛైర్మన్‌ను ఆయన కోరారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన సత్యనారాయణ, తన విజ్ఞప్తిపై ఎన్సీబీసీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో శిష్ట కరణాలు, కళింగ కోమట్లను ఓబీసీ జాబితాలో చేర్పిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement