Monday, April 29, 2024

Delhi | ఏపీ పరిస్థితులపై అమిత్‌ షాకు లేఖ రాశా.. కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టాలని సీపీఐ నారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విశాఖ వివిధ రకాల మాఫియా, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని ఇటీవలి తన విశాఖ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని నారాయణ గుర్తు చేశారు.

అమిత్ షా వచ్చి వెళ్ళిన మూడు రోజులకే వైఎస్సార్సీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందని అన్నారు. ఒక ఎంపీ ఇంట్లో దుండగులు ప్రవేశించి మూడు రోజులు తిష్ట వేసి గంజాయి మాదక ద్రవ్యాలు వాడారని… అగంతకులు, ఎంపీ సత్యనారాయణకు మధ్య అనేక వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని నారాయణ అభిప్రాయపడ్డారు.

కేంద్ర హోంశాఖ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు విశాఖ వ్యవహారంలో ఏమీ చేయలేరని, కేంద్ర హోంశాఖే నిజానిజాలను నిగ్గు తేల్చాలని నారాయణ కోరారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని సంగతి తర్వాత  విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా తల లేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ తయారైందని నారాయణ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement