Wednesday, May 8, 2024

గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్: పంజాబ్‌ ప్రభుత్వం

పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్‌ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ సింధు బుధవారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ ఫతే-2’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ర్యాపిడ్‌ టెస్టు పరీక్ష నిర్వహణ పర్యవేక్షణకు ఆయా జిల్లాల అదనపు డిప్యూటీ కమిషనర్లను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో హోంఐసొలేషన్‌లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్లకు ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కొవిడ్‌ బాధితుడు త్వరగా కోలుకునేలా మందులు, ఇతర సప్లిమెంట్లు అందించేందుకు ‘కరోనా ఫతే కిట్‌’ను ఆరోగ్యశాఖ అందజేస్తున్నదని ఆయన చెప్పారు. కొవిడ్‌ నేపథ్యంలో ‘మిషన్‌ ఫతే-1’ కార్యక్రమాన్ని గతేడాది జూన్‌లో పంజాబ్‌ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement