Saturday, April 27, 2024

అదానీ అంశంపై బీఆర్‌ఎస్ నిరసన.. పార్లమెంట్ గేట్ వద్ద ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా అదానీ అంశంపై బీఆర్‌ఎస్ పట్టు వీడలేదు. గురువారం లోక్‌‌సభ ప్రారంభం కాగానే ఎంపీలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఉభయ సభలను వాయిదా వేయగానే ఎంపీలంతా లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్లమెంట్ ఒకటో నంబర్ గేట్ వద్దకు చేరుకుని విపక్షాలతో కలసి ఆందోళన చేపట్టారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు. హిండెన్‌బర్గ్ నివేదికపై విపక్షాలు ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నామ నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జేపీసీ వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. దేశ ప్రజలకు కావాల్సింది సభలు వాయిదా వేయడం కాదని, అదానీ అంశంపై చర్చ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement