క్వాడ్ లీడర్ల సదస్సులో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ భారత ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత్ కొవిడ్ను ధైర్యంగా ఎదుర్కొని, ప్రజాస్వామ్యపద్ధతిలో ఆ మహమ్మారిపై విజయం సాధించిందని ప్రశంసించారు. ఆసియా ఖండంలోని మరో అగ్రదేశం చైనా కొవిడ్ను కట్టడి చేయడంలో విఫలమైందని బిడెన్ విమర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కూడా భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని బిడెన్ ప్రస్తుతించారు.
భారత్ అమెరికాల మధ్య సంబంధాలను భూతలమ్మీద మరెవ్వరూ ఉండనంత సన్నిహితంగా అమెరికా భారత్ భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు బిడెన్ ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా ప్రపంచదేశాలుఎదుర్కొంటున్న దుష్పరిణామాలను తొలగించేందుకు, ప్రపంచాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ఇండియా అమెరికాలు సంయుక్తంగా చర్చలు జరుపుతాయని, కలిసికట్టుగా ఎదుర్కొంటామని బిడెన్ ఉద్ఘాటించారు.