షార్జా – పాకిస్థాన్కు పసికూన అఫ్ఘానిస్థాన్ భారీ షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది. టీ20ల్లో పాక్ను ఓడించడం అఫ్ఘానిస్థాన్ కు ఇదే తొలిసారి. అయితే సీనియర్లు లేని లోటు పాకిస్థాన్ టీమ్పై గట్టి ప్రభావం చూపించింది. షాదాబ్ఖాన్ కెప్టెన్సీలో ఆ జట్టు ఘోర ప్రదర్శన కనబరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్ వసీమ్(18), షాదాబ్ ఖాన్(23), సయీమ్ అయూబ్(17), తయూబ్ తాహిర్(16) మాత్రమే రెండు అంకెల స్కోరు దాటారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అఫ్ఘానిస్థాన్ బౌలర్లలో ముజీబ్, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా, నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు.
స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ జట్టు 17.5 ఓవరల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించేసింది. మహ్మద్ నబీ 38 పరుగుల నాటౌట్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నజీబుల్లా జర్దన్ 17 నాటౌట్, రహమనుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, ఇమాద్ వసీమ్లు చెరొక వికెట్ తీశారు. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన మహ్మద్ నబీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.