Monday, May 20, 2024

పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో ఆసియాలో అదానీ గ్రీన్‌ నెం 1

భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎజిఇఎల్‌) ఆసియాలోనే నెంబర్‌ 1గా నిలిచింది. ఐఎస్‌ఎస్‌ ఈఎస్‌జి ప్రకారం, పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 10 కంపెనీలలో ఒకటిగా ఘనత సాధించింది. ఎజిఇఎల్‌ అనేది అదానీ గ్రూప్‌కు అనుబంధ సంస్థ. ఐఎస్‌ఎస్‌ ఈఎస్‌జి అనేది పర్యావరణ, సామాజిక, పాలన (ఇఎస్‌జి) పరిశోధన, రేటింగ్‌ల ప్రముఖ సంస్థ. దీని ర్యాంకింగ్‌లు పర్యావరణ ప్రభావం, సామాజిక బాధ్యత, కార్పొరేట్‌ పాలనతో సహా సంస్థ ఇఎస్‌జి పనితీరు సమగ్ర అంచనాపై ఆధారపడి ఉంటాయి.

ఈ ప్రమాణాల ప్రకారం అదానీ గ్రీన్‌ ‘ప్రైమ్‌’ (బి ప్లస్‌) బ్యాండ్‌లో ఉంచబడింది. తాజా ర్యాంకింగ్‌తో 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్‌ యుటిలిటీ రంగంలో ప్రపంచంలోని టాప్‌ 10 కంపెనీలలో ఒకటిగా ఉండాలనే లక్ష్యానికి అదానీ గ్రీన్‌ ఒక మెట్టు చేరువైంది. పునరుత్పాదక ఇంధన రంగంలో 2023 నాటికే ప్రపంచంలోని టాప్‌ 10 కంపెనీలలో ఒకటిగా అదానీగ్రీన్‌ నిలిచింది.

- Advertisement -

అదానీ గ్రీన్‌ 8,216 మెగావాట్ల ఆపరేటింగ్‌ పోర్ట్‌ఫోలియోతో భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థ. దీని కార్యకలాపాలు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులతో పోరాడడం ద్వారా స్పష్టమైన పర్యావరణ ప్రయోజనాలను అందిస్తాయి. ఎజిఇఎల్‌ తన వినియోగదారులకు స్వచ్ఛమైన, పునరుత్పాదక శక్తిని అందించడం ద్వారా మరింత స్థిరమైన ఇంధన వ్యవస్థకు మారడానికి సహాయపడుతుంది. సంస్థ నిబద్ధత కలిగిన నిర్వహణ వ్యవస్థల ద్వారా సంబంధిత సామాజిక, పర్యావరణ సమస్యల్ని పరిష్కరిస్తుందని అదానీ గ్రీన్‌ ఎండీ వినీత్‌ ఎస్‌ జైన్‌ పేర్కొన్నారు.

అదానీ గ్రీన్‌ యుటిలిటీస్కేల్‌ గిడ్‌కనెక్ట్‌ చేయబడిన సోలార్‌, విండ్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తుంది. నిర్మిస్తుంది.. నిర్వహిస్తుంది. ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, అలాగే ప్రభుత్వ మద్దతు ఉన్న కార్పొరేషన్లకు సరఫరా చేస్తుంది. అదానీ గ్రీన్‌ 2030 నాటికి 45 గి.వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకునే లక్ష్యంతో ఉంది. ఇది భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement