Friday, May 10, 2024

Delhi | ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట శేజల్ బైఠాయింపు.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్) లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆరిజిన్ డైరీ సంస్థ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ దేశ రాజధాని ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రతిరోజూ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపడుతున్న శేజల్ గురువారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసిన శేజల్, పార్టీ పదవులపై వ్యామోహంతో ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఒక సందర్భంలో ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన గుర్తుచేసిన శేజల్, ఇప్పుడు తన పార్టీకే చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 100 రోజులుగా న్యాయం కోరుతూ తాను చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తన గోడు ప్రభుత్వ పెద్దలకు వినిపించడం లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో న్యాయం జరగడం లేదన్న కారణంగానే తాను ఢిల్లీ వచ్చి గత 25 రోజులుగా నిరసన తెలియజేస్తున్నానని చెప్పారు.

- Advertisement -

‘పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనీయను’ అన్న రీతిలో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని శేజల్ ప్రశ్నించారు. తెలంగాణలో వ్యాపారం చేసే స్వేచ్ఛ తమకు లేదా అంటూ ప్రశ్నించారు. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తనను వేధించి తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్ కి పంపి తన జీవితం సర్వనాశనం చేశారని ఆమె దుయ్యబట్టారు.

ఈ తప్పులకి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అలాగే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర నాగపూర్‌లో బీఅర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్న సందర్భంగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు బైఠాయించానని, తనకు న్యాయం జరుగకపోతే అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్దంగా ఉన్నానని శేజల్ ప్రకటించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement