Monday, April 29, 2024

అహ్మదాబాద్ : కోహ్లీ బెస్ట్ కెప్టెన్

ఇంగ్లండ్‌పై పింక్‌టెస్టు విజయంతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై టీమిండియా 29టెస్టులు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ రికార్డును బ్రేక్‌ చేశాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా సొంతగడ్డపై 21 మ్యాచ్‌ల్లో గెలిచింది. మొత్తంమీద కోహ్లీ సారథ్యంలో భారత్‌ ఇప్పటివరకు 59టెస్టులు ఆడి 35మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో స్వదేశంతోపాటు విదేశాల్లోనూ టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన సారథిగా కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ తర్వాత ధోనీ 60మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండోస్థానంలో ఉండగా సౌరవ్‌ గంగూలీ 21 విజయాలతో మూడో ఉత్తమ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మార్చి 4నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లోని చివరిటెస్టులో టీమిండియా విజయం సాధిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా భారత్‌ అవతరిస్తుంది. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టినప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమిండియాకు అందించిన ఘనత కూడా కోహ్లీకి దక్కుతుంది. కాగా రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడం గమనార్హం.
సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌ అసలైన క్రికెట్‌కు చిరునామాగా పేర్కొంటారు. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌ వైపు అభిమానులు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బౌలర్‌ లేదా బ్యాట్స్‌మన్‌ సామర్థ్యం టెస్టుమ్యాచ్‌లే వెలికి తీస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏకపక్షంగా జరిగే మ్యాచ్‌ల్లో ఫలితం మూడు లేదా నాలుగు రోజుల్లో తేలేది. తాజాగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగియటం చర్చనీయాంశంగా మారింది. అగ్రశ్రేణి జట్లు రెండు తలపడితే రెండు రోజుల వ్యవధిలో మ్యాచ్‌ ముగిసిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిపోవడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 22వ సారి..సుదీర్ఘ ఫార్మాట్‌లో మొత్తం 2,412 టెస్టులు జరిగితే వీటిలో 22టెస్టులు రెండురోజుల్లోనే పూర్తయ్యాయి. ఇంగ్లండ్‌ అత్యధికంగా 13సార్లు రెండురోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల్లో పాలుపంచుకుంది. 13టెస్టుల్లో ఇంగ్లండ్‌ 9సార్లు గెలిచి 4మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 1882 తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌ రెండురోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. గత 20ఏళ్లలో మొత్తం 7టెస్టులు రెండురోజుల్లోనే పూర్తయ్యాయి. 2000 సంవత్సరంలో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌, 2002లో పాక్‌పై ఆస్ట్రేలియా, 2005లో జింబాబ్వేపై సౌతాఫ్రికా, అదేఏడాది జింబాబ్వేపై న్యూజి లాం డ్‌, 2017లో జింబాబ్వేపైనే మరోసారి సౌతాఫ్రికా గెలుపొందగా. .2018లో అప్ఘనిస్థాన్‌పై, 2021లో ఇంగ్లండ్‌పై భారతజట్టు విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement