Tuesday, May 7, 2024

హక్కుల ఉద్యమాలకు గండం!

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రజలకుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా సమాజంలోని వివిధ వర్గాలు చేసే ఆందోళనలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం అండ ఉండబట్టే రాష్ట్రాలు ఇలాంటి బిల్లులను అసెంబ్లిల చేత ఆమోదింప జేస్తున్నాయి. గుజరాత్‌లో సీఆర్‌పీసీ 144వ చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు విశేషమైన అధికారాలను దఖలు పరుస్తూ రాష్ట్ర అసెంబ్లి ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్‌వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసులకు విశేష అధికారాలు కల్పించే చట్టాన్ని సవరిస్తున్నామంటూ ప్రభుత్వంలోని పెద్దలు ఒక పక్క ప్రకటిస్తూనే మరో వంక ఇలాంటి బిల్లులకు ఆమోదం తెలపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్‌లో గతంలో జరిగిన హింసాకాండ, మారణ హోమం ఘటనల్లో పోలీసులు అతిగా ప్రవర్తించినట్టు సిట్‌ దర్యాప్తులోనూ, పలు జ్యుడీషియల్‌ కమిషన్ల దర్యాప్తులోనూ తేలింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన శ్రీకుమార్‌ వంటి వారు జైలుపాలు అయ్యారు. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ కేసుల నుంచి బయటపడేందుకు రాజ కీయ నాయకులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ కేసులను తవ్వి తీసిన మానవ హక్కుల ఉద్యమకారులైన తీస్తా సెతల్వాడ్‌వంటివారు విదేశాల నుంచి అక్రమంగా విరాళాలు సేకరించారన్న అభియోగాలపై కేసులు నమోదు చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యతీసుకోవడానికి బదులు, ఫిర్యాదు చేసిన వారిపై కేసులు మోపి, జైళ్ళలో పెట్టడంపై ఆందోళనలు సాగుతున్న తరుణంలో గుజరాత్‌ ప్రభుత్వం ఇవేమీ తమకు పట్టనట్టుగా ఇలాంటి బిల్లులను ఆమోదిం చడంపై హక్కుల ఉద్యమకారులు, సామాజిక భద్రతా పరిరక్షణకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించింది. కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుజరాత్‌) సవరణ బిల్లును గత ఏడాది మార్చి లో అసెంబ్లి ఆమోదించింది. ఈ చట్టం కింద పోలీసు కమిషనర్లు, అదే హోదా కలిగిన పోలీసులు అధికారులు సెక్షన్‌ 144 కింద జారీ చేసే నిషేధాజ్ఞలను ఉల్లంఘిం చేవారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం సంబంధింత అధికారులకు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో, కాశ్మీర్‌లోను అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికార చట్టం ఇంత కన్నా క్రూరమైంది. సాయుధ దళాలు ఎవరినైనా అనుమానిస్తే అరెస్టు చేయవచ్చు. వారిపై విచారణ లేకుండానే జైలులో పెట్టవచ్చు.

ఈ చట్టం కింద కొన్ని ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. దీనిపై దేశంలోని ప్రతిపక్షాలు చాలాకాలంగా పోరాటం సాగిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు సాగించడం, అధికారం లోకి రాగానే ఆ చట్టాన్ని గురించి పట్టించుకోకపోవడం ఆనవాయితీ అయింది. గుజరాత్‌ బిల్లును అసెంబ్లి ఆమోదించి రెండు నెలలు తక్కువగా ఏడాది అవుతున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదించారు.ఇటీవల గజరాత్‌ అసెంబ్లిd ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇంతవరకూ ఆగి ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర పడినా ప్రతిపక్షాలు ఏమీ చేయలేవన్న ధీమాతోనే ఆమోదించి ఉంటారు. అంతేకాదు. గుజ రాత్‌ అసెంబ్లి ఎన్నికల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పక్షాలు ప్రతి సభలోనూ బీజేపీని విమర్శించాయి. అయినా ప్రజలు తమకే ఓటు వేశారు కనుక, దీనికి ప్రజల ఆమోదం ఉందని కమలనాథులు వాదించినా ఆశ్చర్యం లేదు. ఎటువంటి ప్రత్యేకాధికారాలు లేకపోయినా, పోలీసులు ఇప్పటికే అనుమానితులను అర్థరాత్రి వేళ ఇళ్ళ నుంచి తీసుకుని వెళ్ళి జైళ్ళల్లో కుక్కుతున్నారు.

- Advertisement -

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సంస్థకి చెందిన అధికారులు సామాజిక సేవారంగంలో ఉన్న వారినీ, కవులు, రచయితలను అరెస్టు చేసి కేసులు బనాయిస్తున్నారు. ఏళ్ల కొద్దీ జైళ్ళలో కొనసాగిస్తున్నారు. ఇందు కు మన తెలుగు కవి వరవరరావు నిర్బంధమే ఉదా హరణ. 2018లో కోరేగావ్‌లో వామపక్ష తీవ్రవాదులు పన్నిన కుట్ర కేసులో భాగస్వామి అని ఆయనను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వృద్ధాప్యాన్ని కూడా చూడ కుండా జైలులో పెట్టారు. అయితే, ముంబాయిలో చికిత్స కు కోర్టు అనుమతించింది. ఆయన మాదిరిగా జైళ్ళలో ఉన్న వృద్ధుల్లో కొంతమంది ప్రాణాలు వదిలారు. అయి తే, సీఆర్‌పీసీ చట్టాన్ని ఆయా రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుం టున్నాయని హక్కుల ఉద్యమ కారులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశా రు. ఇలాంటి కేసులలో కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్‌ సీఆర్‌పీసీ సవరణ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించి ప్రజా స్వా మ్య ఉద్యమ కారులపై విరుచుకుని పడే ప్రమాదం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement