Friday, April 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

27. అమ్మా! యయ్య!యటంచునెవ్వరిని నే నన్నన్ శివా! నిన్నునే
సుమ్మీ! నీ మది( దల్లిదండ్రులనటంచుంజూడగా( బోకు, నా
కిమ్మై( దల్లియు( దండ్రియున్ గురుడు నీవే కానసంసారపుం
జిమ్మంజీకిటి కప్ప కుండం గనుమా ! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! శివా- శుభప్రదుడవైన శివా! నేను- నేను, అమ్మా- తల్లీ! అయ్యా- నాన్నా!, అటంచు- అంటూ, ఎవరిని-ఎవరిని, అన్నన్- పిలిచినా, నిన్నునే- నిన్నే, సుమ్మీ- సుమా!, తల్లి తండ్రులన్-జననీ జనకులని, అటంచున్-పిలుచుచున్నానని, మదిన్- మనస్సులో, చూడంగాన్- పోకు- తలచ వద్దు, నాకు- నాకు, ఈ -వ్మైన్- ఈ శరీరానికి, తల్లియున్-తల్లియు, తండ్రియున్- తండ్రియు, గురుడున్- గురువును, నీవు- ఏ- నువ్వు మాత్రమే, కాన- అందువలన, సంసారము- చిమ్మచీకటి- సంసారం అనే దట్టమైన చీకటి, కప్ప కుండన్- అవరించ కుండా, కనుమా-చూడవలసినది , కాపాడవలసినది.
తాత్పర్యం: శుభప్రదుడవైనశ్రీకాళహస్తీశ్వరా! అమ్మా!, నాన్నా! అని నేను ఎవరినైనా పిలిచినా ఆ పిలిచినది నిన్నే సుమా! పిలిచినది జన్మ నిచ్చినతల్లితండ్రులనిఅని భావించ వద్దు. ఎందుకంటేశరీరధారినైన నాకు ఈ జన్మలో తల్లి, తండ్రి, గురువు నీవే. నమ్మిన నన్ను జననమరణ రూపమైన అంధకారం కప్పివేయకుండకాపాడుము.
విశేషం: ధూర్జటి అనన్యభక్తి, శరణాగతి, ప్రస్ఫుటంగా కనపడతాయి ఈ పద్యంలో. 24, 26 పద్యాలలో చెప్పిన భావాలనే ఈ పద్యంలో నొక్కివక్కాణించాడు. ఎవరిని ఏ చుట్టరికంతో సంబోధించినా అది శివుణ్ణి పిలిచినట్లే అనటం సమస్తంలోనూ సర్వాంతర్యామి అయిన శివుణ్ణే ధూర్జటి దర్శించి, అనుభూతి చెందటానికి నిదర్శనం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement