Wednesday, May 8, 2024

శయన హనుమంతుడు

హనుమంతుడు అనగానే అపారమైన భక్తి, పరాక్రమం… అసమానమైన మేధస్సు… వినయం, విధేయతలు గుర్తుకొస్తుంటాయి. ఒక భక్తుడు ఎలా ఉండాలో… ససాక్ష్యంగా నిరూపించిన భగవంతుడు హనుమంతుడు. అనేక ప్రాంతాల్లో అనేక నామాలతో ఆవిర్భవించిన ఆయన భక్తాంజనేయుడుగా… వీరాంజ నేయుడుగా, వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభ యాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి. ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు. అయితే అందుకు పూర్తిభిన్నంగా స్వామి వారు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా వుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరాకి సుమారు 4 కి.మీ. దూరంలో ‘ఖుల్తాబాద్‌’లో ఉంది. దానినే భద్ర మారుతి టెంపుల్‌గా పిలుస్తారు. శయన స్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి ఆలయం ప్రత్యేకత. ఇక్కడి హనుమంతుడిని స్వయంభువుగా చెబుతుంటారు. ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకుని సేదతీరుతాడని ఒక కథ ప్రచారంలో ఉండగా పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు రాముడిపై గల భక్తితో శ్రీరాముడిని ఎప్పుడూ భజనలతో, స్తోత్రాలతో తనను తాను మైమరిపోయి స్తుతిస్తూ ఉండేవాడనీ, ఒక రోజు భద్రకూట్‌ సరోవరం వద్ద భద్ర సేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా వినిన హనుమంతుడు అక్కడికి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకొని నిద్రపోయాడట. చాలాసేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడి, లోకకళ్యాణం కోసం, భక్తులను సదా అనుగ్రహంచేందుకు అక్కడే కొలువై ఉండవలసిందిగా విన్నవించుకోగా హనుమంతుడు ఆ కోర్కెను మన్నించి అక్కడే కొలువైనట్లు మరో కథనం ప్రాచుర్యంలో ఉంది. ఆ కారణంగా ఆయన శయన హనుమంతుడిగా దర్శనమిస్తూంటాడు ఈ స్వామిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement