Monday, May 13, 2024

ఆధ్యాత్మికతను పరిచయం చేసిన సనాతనము

ధర్మము అనగా స్వభావము, బాధ్యత, సన్మార్గము అని నిర్వచించుకొనవచ్చు. దివ్య జీవిత మార్గమును శ్రీ భాగవతము కల్పిస్తుంది. నిత్యజీవిత సన్మార్గమును శ్రీ మహాభారతము సూచిస్తుంది. ఆదర్శ జీవన విధానాన్ని శ్రీ రామాయణము బోధి స్తుంది. ఆత్మ, పరమాత్మ ఉనికిని ఉపనిషత్తులు విశదీకరిస్తాయి. మానవులు ఎలా తమ జీవ నయాత్రను కొనసాగించాలో తెలియచేసే దిక్సూచి శ్రీ భగవద్గీత. త్రిమూర్తులు, త్రిగుణా లు, సృష్ట, స్థితి, లయములు మొదలగు అపూర్వ విషయములను మానవులకందించినవి వేదములు.
ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడని ఆదిత్య హృదయం విశ్లేషించింది. కాలము దైవ స్వరూపమని, కాలమును యుగాలుగా గణించినది భారతీయ ఖగోళ శాస్త్రము, ఋషిప రంపర. విశ్వము అనంతమయినదని, భూత, భవిష్యత్‌, వర్తమానముల భ్రమణమే విశ్వ గమనమని విష్ణుసహస్ర నామములు తెలియచేసాయి. విశ్వము విష్ణు స్వరూపమని సర్వ భూతముల యందు ఆత్మ రూపమున పరమాత్మ నియంత్రించుకున్నాడని చెబుతుంది. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడం విశ్వధర్మం. ఈ పాల పుంతల సమూహాలు కోటానుకోట్ల నక్షత్ర రాశులతో నిత్యమూ చలించుచుండడం కూడా విశ్వధర్మమే! ఆ ధర్మమును ఏర్పరచినవాడు భగవంతుడని, శక్తియుతుడని విశ్వసించడం కూడా ధర్మమే! అటువంటి పరమాత్మ పట్ల ప్రేమయుతమైన, విశ్వాసభరితమైన, భక్తిని ప్రకటించడం కూడా ధర్మమే!

సవై పుంసాం పరోధర్మోయతో భక్తి రధోక్షజే
అహైతుక్య ప్రతిహతాయయాత్మా సుప్రసీదతి

సృష్టికర్త భగవంతుని పట్ల భక్తి పూర్వకమైన సేవను కలిగింపజేయునదియే మానవాళికి నిర్దేశింపబడిన పరమోన్నతమైన ధర్మం. ఏవిధమైన కోరికలు లేకుండా, నిరం తరముగా సాగుతూ ఆ సేవ మానవాళికి సంపూర్ణ ఆత్మానందం కల్గించాలని శ్రీ మద్భాగవ తం వివరించింది. ఇటువంటి పరమధర్మముల సమాహారమే సనాతన ధర్మము. మానవజన్మకు ఒక లక్ష్యము, సాధన, మరణానంతర జ్ఞానము తెలియజేసిన సనాతన ధర్మ ము ఆద్యంతములు లేనిది నిత్యనూతనం, మానవహితకరం, అనుసరణీయం సనాతనం.
సకల శాస్త్రములకు భావనాత్మక నాంది పలికినది సనాతన ధర్మము. మానవునకు ఆత్మను అధ్యయనము చేయు గొప్ప మార్గమైన ఆధ్యాత్మికతను పరిచయం చేసింది సనాత న ధర్మము. ఇది ఒక విశ్వవాహిని. నిత్యానంద స్వరూపుడు మనిషి అని మొట్టమొదట తేట తెల్లం చేసింది. ”అహం బ్రహ్మోస్మి” నేనే బ్రహ్మస్వరూపాన్ని, జీవాత్మను, ఆ పరమాత్మలో భాగాన్ని, ఇవన్నీ ఒక్కడే! అనే రహస్యాన్ని విప్పి చెప్పింది సనాతన ధర్మ వాఙ్మయం. అం దుకే పరిణతి చెందిన నివృత్తి మార్గ యోగిపుంగవులు ఆత్మతత్త్వము గురించి విచారణ చేయమన్నారు. ప్రవృత్తి మార్గం పశుప్రాయమైనది. ఈ మార్గంలో భోగ త్యాగం చేయలేక పశుప్రవృత్తిలో మమేకమై అజ్ఞానంతో దొరికిన అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారు. ఏ మార్గములోనున్నా జీవించవచ్చు కానీ పరమ సత్యమును తెలుసుకుని సచ్చిదానందము ను అనుభవించి పరమాత్మలో లయమవ్వమని సనాతన ధర్మ మార్గం సూచిస్తోంది. ప్రతి క్షణం సృష్టి, లయం జరుగుతూ ఉంటాయి. మానవునితో పాటు ఎనభైనాలుగు లక్షల జీవర కాలు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. మరణాన్ని ఎవరూ ఆపలేరు. అది సృష్టి ధర్మం. అయితే ఈ బుద్బుధప్రాయమైన మానవ జీవితంలో సత్యాన్ని తెలుసుకుని నివృత్తి మార్గంలో పయనించి ముక్తిని పొందమని ఒక్క సనాతన ధర్మమార్గము మాత్రమే బోధి స్తోంది. లేకపోతే ఆనందానికి దూరమయి, అసుర ప్రవృత్తి దగ్గరయి నిత్యమూ దూషించ బడుతూ తిరిగి ఈ భూమి మీద అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉండవలసి వస్తుందని హెచ్చరిస్తోంది. దానికి ప్రధాన కారణం దేహాత్మభావన.
పంచభూతాత్మకమైన ఈ దేహం నశించిపోయేదని, అంతర చతుష్టయంతో జీవితకా లంలో నీవు చేసే పుణ్య పాపకర్మలు, వాటి ఆలోచనలు కూడా నశించిపోయేవేనని తెలుసుకో వడమే జ్ఞానం. శాశ్వతమైన పరంధామం చేరుకోవడానికి, జన్మరాహిత్యం పొందడానికి కావలసిన శాశ్వత ఆత్మజ్ఞాన తత్త్వాన్ని సాధన ఎలా చేయాలో నేర్పింది ఒక్క సనాతన ధర్మ ము మాత్రమే!
గృహస్థుగా, పరమహంసగా, సన్యాసిగా ఈ స్వల్పమైన మానవజన్మను సచ్చిదానం దముతో గడపి పరమాత్మలో లీనమవడానికి కావలసిన సంపూర్ణ శక్తి, యుక్తులను మాన వుడికి అందించినది ఒక్క సనాతన ధర్మము మాత్రమే!
ఆధ్యాత్మిక అభ్యున్నతికి, మనసులోనున్న మాలిన్యాలను తొలగించుకోవాలి. ము ఖ్యంగా అహంకారం. ఈ అనంత విశ్వంతో పోల్చుకుంటే మనమెంత? మన బ్రతుకెంత? మన జ్ఞానమెంత? అన్న భావన కలిగి ఉండాలి. మంచి విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించినంత మాత్రాన విజ్ఞానవంతమైన నాగరికుడు అయిపోరు. నేడు నీ చేతిలోనున్న అధికార మదం వల్ల అసురునిగా మారితే అనందానికి దూరమయినట్లే! ”పరోపకార పుణ్యాయా, పాపాయా పర పీడనం” చేస్తే పరులకు ఉపకారం చెయ్యి! పరులను పీడించి పాపం మూట కట్టుకోకు! అని బోధిస్తుంది సనాతన ధర్మము.
సనాతన ధర్మమనునది ఒక సామూహిక స్వభావము. అది ఏ యుగములోనైనా సృష్టి హితమును, మానవ కళ్యాణమును మాత్రమే కోరుకుంటుంది. మానవుని సహజ స్వరూ పమైన ఆనందమునకు వ్యతిరేకంగా ఏది జరిగినా అది అధర్మమే అవుతుంది. ఇక్కడ ఆనం దమంటే ప్రవృత్తి మార్గంలో చేపట్టే భౌతికానందం కాదు. ఈ భౌతికానంద భోగ లాల సత్త్వానికి అంతంలేదు. తృప్తి, సంతృప్తి అసలేలేదు. నీ కోరిక తీరాలంటే కొంతమంది కోరిక లకు భంగం కలిగించాల్సిందే! నీ అహంకారం నిలవాలంటే కొంతమంది అహాన్ని భగ్న పరచవలసిందే! ఒకసారి నీ చేయిపైన ఉంటే మరొకసారి ఇతరుల చేయి పైన ఉంటుంది. నిత్యం ఘర్షణ తప్పదు. ఆనందమంటే అది కాదని, నివృత్తి మార్గంలో ప్రమాదకర కోర్కె లను విడనాడి జీవనానికి కావలసిన ఆశను తనకిమ్మని ఆ సృష్టికర్త పరమాత్మను భక్తితో అభ్యర్థించమని సనాతన ధర్మం సూచిస్తుంది.

”నిత్యో నిత్యానామ్‌ చేతనాశ్చేతనానామ్‌
ఏకో బహూనామ్‌ యో విదధాతి కామాన్‌”

అందరికీ, అన్ని ప్రాణులకీ కావలసిన దాన్ని అందించేది చేతనాల్లోకెల్లా సర్వోత్కృ ష్టమైన చైతన్యమూర్తి ఒక్కటే ఉంది. అదే యదార్థం, పరమాత్మ, భగవంతుడు దాని కోసం అన్వేషించమని కఠోపనిషత్తు నిర్దేశించింది. ఇటువంటి మహిమాన్విత మణిహారమే సనా తన ధర్మ మార్గము. ఇది అనంతము, అజరా మరము , సర్వశ్రేయోదాయకము.

Advertisement

తాజా వార్తలు

Advertisement