Monday, April 29, 2024

KNR: కుర్జుకమ్మి భూముల సర్వే నివేదిక సిద్ధం చేయాలి… కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

గోదావరిఖని, సెప్టెంబర్‌ 20 (ప్రభన్యూస్‌): కుర్జుకమ్మి భూముల సర్వే నివేదిక ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. బుధవారం అంతర్గాం మండలం రాయదండి గ్రామ శివారులో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ కుర్జుకమ్మి భూముల సర్వే పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… కుర్జు కమ్మి భూముల సర్వే పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ పేరుతో అప్పటి నిజాం ప్రభుత్వం నామమాత్రపు ధరలకు సేకరించిన కుర్జుకమ్మి భూములను ప్రభుత్వం సర్వే చేస్తుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అసైన్‌ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. రాయదండి గ్రామ శివారులో 193 సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 1018 ఎకరాలను సెప్టెంబర్‌ 6 నుంచి 20 వరకు సర్వే నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల పెండింగ్‌ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని, పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేసి అర్హులకు త్వరగా పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడి సర్వే శ్రీనివాసులు, డిఐ గణపతి, సర్వేయర్‌ అశోక్‌, గిర్థావార్‌ రాజేందర్‌ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement