Thursday, May 2, 2024

రథసప్తమికి జిల్లేడు ఆకుకి సంబంధం

రథసప్తమి. మాఘ శుద్ధ సప్తమి సూర్య జయంతి. సూర్యుడుకి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆనాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడు ఆకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడు ఆకునో ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహమూ వస్తుంది. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించింది. దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. ఆ మేక చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడాకు యజ్ఞం సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుంది అందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డా రు. అప్పుడు ఆకాశవాణి, ”మీరు దు:ఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది” అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. ఆ రోజు మాఘశుద్ధ సప్తమీ తిథి. అప్పటి నుండి రథసప్తమిరోజు స్నానం చేసే సమయంలో నెత్తిపై జిల్లేడాకు, రేగుపండ్లు పెట్టుకుని, సూర్య ప్రీతి కోసం స్నానం చేయాలని, అలా చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తుందని, ఏడుజన్మల పాపాలు నశిస్తాయని పురాణ కథనం.

  • పుల్లాభొట్ల భాస్కరశర్మ
Advertisement

తాజా వార్తలు

Advertisement