Saturday, April 27, 2024

తత్త్వ విచారణే జ్ఞానమార్గం

తత్త్వవిచారణ చేయని మానవుడు పశుప్రా యుడు. పండితుడైనా పామరుడైనా జీవి త సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ”నేనె వడను? ఎక్కడ నుంచి వచ్చాను? ఈ ప్రపంచము ఎటుల, ఎక్కడ నుండి వచ్చినది?” అను ప్రశ్నలు ఉత్పన్నము కాక తప్పదు. ఆస్థికుడైనా, నాస్థికుడైనా ఏదో సందర్భములో తనకుతాను ఈ ప్రశ్నలు వేసు కొని సమాధానము కొరకు అన్వేషణ కొనసాగిం చినవారే మనుషులు అని భావించబడును. కాయ కష్టము చేసి లభించిన ఆహారమును తృప్తిగా భుజిం చి ఆరుబయట పడుకుని ఆకాశమును చూస్తూ పరుండిన శ్రమజీవి మదిలో రేగే ఆలోచన కూడా తత్త్వమే! అద్భుతమైన నక్ష్రత గ్రహరాశుల శోభను చూసి ”ఎవరు సృష్టిం చారు ఇదంతా?” అను ప్రశ్న తో తనకు తానుగా ఆ కనబడని భగవంతుని ప్రస్తు తిస్తూ నిద్రలోకి జారడమే తత్త్వదర్శనం.
విచారణ తత్త్వమును గ్రహించుచున్నది. తత్త్వవిచారణ నుండి ఆత్మశోధన ప్రారంభమవు తుంది. తత్త్వవిచారణ అలౌకిక జ్ఞానమునకు నాంది పలుకుతుంది. జ్ఞానము నుండి ఆత్మస్థితి, శాంతిని పొంది సర్వదు:ఖ వినాశము పొందుతాడు.
పరమాత్మయీ మాన్యామహానన్దైకసాధీనీ
క్షణమేకం పరిత్యాజ్యా న విచారచమత్కృతి:||
ఈ అద్భుత శ్లోక రాజమును యోగవాసిష్ఠలో వసిష్ఠ మహర్షి శ్రీరామ చంద్రునకు ఉపదేశించినా డు. పరమాత్మమయమైన మహదానందమును సాధించుటకు శుష్క విచారణలను విడిచి అత్యంత జ్ఞానమయమయిన ఆత్మతత్త్వ విచారణను అను క్షణం చేయుచుండవలెనని బోధించెను. ఈ విచార ణ బుద్ధిని తీక్షణత్వమునకు గురిచేసి పరమాత్మ పదమును వీక్షింపచేయును. సంసారమను దీర్ఘరో గమునకు తత్త్వవిచారణ ఒక గొప్ప ఔషదము.
ఈ జగత్తును తత్త్వజ్ఞానముతో విచారించని కారణము వలననే సత్యముగానూ, అత్యంత రమ ణీయముగాను కనిపించుచున్నది. లోతుగా విచా రించినచో ఇది ఒక మిథ్యయని తేలిపోవును. ఇది తెలిసినా కానలేక అరిషడ్వర్గములలో మునిగి తత్త్వవిచారణ చేయులోపు మనోచిత్రము మాయ మై బుదర్బుధప్రాయమైన జీవితకాలము ముగిసి పోవుచున్నది. తిరిగి మానవజన్మ లభించువరకూ తత్త్వవిచారణ చేయు అవకాశము లభించకున్నది.
అప్రాప్తవాంఛా ముత్సృజ్య సంప్రాప్తే సమతాంగత:
అదృష్ట ఖేదాఖేదోయ: స సంతుష్ట ఇహోచ్యతే||
తనకు ప్రాప్తించని వస్తువును గూర్చిన కోరిక లేనివాడు, ప్రాప్తించిన వస్తువునందు మిథ్యాతత్త్వ మును చూస్తూ హర్షము, శోకము లేనివాడై, సుఖ దు:ఖాది ద్వంద్వములు లేనివాడని చెప్పబడును.
తృప్తిచేత పూర్ణమైన మనోభావన కలవాడు సర్వసంపన్నుడుగా చెప్పబడును. అటువంటి వారి ని సాధువులని, సజ్జనులని, సత్పురుషులని భావిం చవలెను. అటువంటివారి సాంగత్యము చేయుట ఆత్మతత్త్వ విచారణకు మహోపకారియై నిలుచును.
ఒకవిధముగా జనన మరణ మధ్యనున్న కాల మను మాయను గురించి విచారణ చేయుటయే ఆత్మ తత్త్వవిచారణ. ఆత్మను అధ్యయనము చేయు టయే ఆధ్యాత్మికత. తాపము, మాలిన్యములను నశింపచేయునటువంటి సాధుజన సాంగత్యము శీతల నిర్మల గంగానదియందు స్నానము చేయున టువంటి వారికి వేరు తపస్సు, యజ్ఞము అవసర ములేదు. వారి సాంగత్య విచారణలో ఆత్మజ్ఞాన ఫలమును పొందును.
విశ్రాన మనసో ధన్యా: ప్రయత్నేన పరేణహి
దరిద్రేణవ మణయ: ప్రేక్షణీయాహి సాధన:||
పరమాత్మయందు లయము నొందినటు వంటి విశ్రాంతినొందిన మనసుగలవారును, ధన్యు లైన మహాత్ములగు సాధుజనులను, దరిద్రుడు మ ణులను వెతుకునట్లు పట్టుదలతో వెదుకవలెను.
సుఖప్రదమైన ఆసనారూఢుడై ఆత్మచింతన చేయువారు, ఆ మహదానందమును అనుభవించు వారు, శాస్త్రసదాచార విచారణ చేయువారు, దేశ కాలమానములను అనుసరిస్తూ సజ్జన సాంగత్య ము ను అనుసరించువారు, సంసారశమమును పొందినటువంటి మహాజ్ఞానము పొందుచున్నా రు. అటువంటి వారే తిరిగి మోనియంత్ర నరక మునుండి విముక్తి పొందుచున్నారు. అటువంటి జ్ఞాన, సదాచార సాధన సంపత్తి ద్వారా ఆత్మతత్త్వ మును మననము చేయువారు వారికి తెలియకుం డానే పరమాత్మ పదమున నడుచును. అయితే ఇక్కడ సజ్జనుల అన్వేషణ కూడా ఒక జ్ఞానవంత మైన సాధనగా జాగరూకత కలిగియుండాలి.
అజ్ఞాని కాషాయ బట్టలు కట్టుకున్నా సజ్జనులు, జ్ఞాన యోగులు కారని, వారి వేషాలన్నీ పొట్ట కూటి కొరకేనని, అసలుసిసలైన సజ్జనులను కూడా జ్ఞాన ముతోనే కనుగొని ఆశ్రయించాలని శ్రీ శంకరుల శిష్యుడు తోటకాచార్యులవారు భజగోవిందములో హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement