Tuesday, April 30, 2024

సర్వ కర్మ ఫల త్యాగం

కొందరికి మనస్సు కుదురుగా ఉండదు. పూర్తిగా దైవకార్యాలలో మునిగిపోతే బ్రతుకు తెరువు ఎట్లా? అని సందేహం. వాళ్ళు స్వంత పనులు మానుకోలేరు. ”అయితే కర్తృత్వాన్ని వదిలి ఎట్టి పనులు చేసినా సరిపోతుంది. అప్పుడవి భగవత్‌ కర్మలే అవుతాయి గదా!” అని తెలిసినా అలా కర్తృత్వాన్ని వదిలి ఉండలేరు. కర్తృత్వంతో కర్మలు చేయటం అలవాటు. ఎంతకాదనుకున్నా నేను కర్తననే అహం కారం వదిలిపోదు. మరి అలాంటి వారి గతిఏమిటి? వారికి కూడా భగ వానుడు ఇక్కడొక ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు. అదే ”సర్వకర్మ ఫలత్యాగం” మనం పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫలితం వచ్చి తీరు తుంది. ఆ వచ్చే ఫలితం మీదనే దృష్టి పెట్టి వస్తుందా? రాదా? అనుకు న్నంతగా వస్తుందా? తక్కువగా వస్తుందా? అని ఆలోచిస్తూ ఉంటే చేసేపని మీద శ్రద్ధ ఉండదు. అందువల్ల నైపుణ్యంగా పనులు చేయలేము. అలాకాకుండా వచ్చే ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా, దానిమీద ఏమాత్రం ఆసక్తి లేకుండా శ్రద్ధ గా, కర్తవ్య భావంతో, తన విద్యుక్త ధర్మంగా కర్మలు చేస్తుంటే ఆ కర్మలు సక్రమంగా జరుగుతాయి, పనిలో నైపుణ్యం కూడా ఉంటుంది. కనుక కర్మఫలాలను భగవంతునికి అర్పించాలి. అలాచేస్తే లోపల పేరుకున్న రజోగుణం అణగిపోతుంది. సరే సర్వకర్మ ఫలత్యాగం అన్నారు గదా! అంటే పాపకర్మల ఫలాన్ని కూడా అర్పించాలా? చెడ్డ కర్మలను, పాపకర్మలను వదిలి వేయాలని ముందే చెప్పుకున్నాం. కనుక శాస్త్రవి#హత కర్మలనే చేయాలి. వాటి ఫలాన్నే వదిలివేయాలి. పాపకర్మలు అసలు చేయకూడదు. ఈ సర్వకర్మల ఫలత్యాగం అనేది దాదాపుగా అందరికీ అనుకూలమైనదే. కొద్ది ప్రయత్నంతో ఎవరైనా అను సరించవచ్చు. అందుకే ”యతాత్మవాన్‌” అన్నారు. ప్రయత్నిం చి సాధించుకోవాలి.
నిజంగా భగవద్గీత సారమంతా ఇదే. ”కర్మణ్య వాధికారస్తే మాఫలేషు కదాచన” కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు- ‘కృపణా ఫల హతవ:’ అని అన్నారు. ఇది భగవద్గీత సారమే గాదు. భగవానుని జీవితసారం కూడా ఇదే.
శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లి
దండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు.
నంద గోకులంలో వెన్న దొంగిలించినా తన కోసం
కాదు, స్నేహతులకు కోతులకు పెట్టేవాడు.
కంసుని చంపినా రాజ్యాధికారాన్ని కోరలేదు.
ఉగ్రసేనునికే కట్టబెట్టాడు.
జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి
కుమారుడు సహదేవునే పట్టాభిషిక్తుని చేశాడు.
శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే
రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు
భగదత్తుని రాజుగా చేశాడు.
దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం
చేశాడు. నాకేం ఇస్తావు? అని అడగలేదు.
పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయ
పడినా ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు.
రథాన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా- సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్న పనియా? అనలేదు. ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్ర మంగా నిర్వర్తించటమేగాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తిలేదు. దేనినీ కోరలేదు.
మరి మనం మాత్రం ఏ ఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి? అంటాం.
సూర్యుడు వెలుగునిచ్చి నీవద్ద నుండి ఏం కోరుతున్నాడు?
వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం
కోరుతున్నాడు?
నదులు నీటినిచ్చి దప్పికతీర్చి నీనుండి ఏమికోరుతున్నాయి?
భూమి ఆధారంగా ఉండి, పంటలనిచ్చి ఏమి కోరుతున్నది?
చెట్లు ఫలాలు, పుష్పాలు నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి?
చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు?
మన సమస్త ఇంద్రియాలకు శక్తినిచ్చి పరమాత్మ ఏమి
కోరుతున్నాడు?
కానీ దేవాలయంలో పూజగాని, అభిషేకంగాని చేయించిన తరువాత ”ఏతత్‌ ఫలం సర్వం పరమేశ్వరార్పణ ుస్తు” అని పూజారి మంత్రం చదవగానే ఖర్చు మనదీ ఫలితం పరమాత్మకా? అని లోలోపల గొణు క్కుంటాం అర్థం తెలిస్తే. మనకు పనికన్నా ఫలితం ముఖ్యం. అందువల్ల మనకు బంధమేగాని మోక్షంలేదు. కర్మఫలం కోరినందువల్ల మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చిపెడుతుంది. జన్మలు మళ్ళీమళ్ళీ కర్మలకు- కర్మ ఫలాలకు కారణమౌతాయి. ఇలా కర్మ- కర్మఫలం- జన్మ- కర్మ- కర్మ ఫలం- జన్మ అనే కర్మ- జన్మ వలయంలో, జనన మరణ చక్రంలో, కర్మ సుడిగుండంలో చిక్కుకుపోతాం. కనుక కర్మలు చేస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి. సర్వం శ్రీకృష్ణార్పణం, రామార్పణం, భగవదార్ప ణం అంటూ సర్వకర్మలను చేయాలి. ‘గాలికి పోయే పేలపిండిని కృష్ణా ర్పణం’ అనటం కాదు. ఇంట్లో ఉన్నదానిని, నోట్లోకి పోయేదానిని కూడా అనగలగాలి.

– కామిడి సతీశ్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement