Friday, April 26, 2024

శుద్ధాద్వైతం ఆయన మతం వల్లభాచార్య

(వల్లభాచార్య 542వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం)

అన్య మత మార్పిడులు అధికమై, హందవ సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న విషమ పరిస్థితులు, పుష్టి మత స్థాపకుడు శ్రీపాద వల్లభాచార్య అవతరణకు కారణ భూతాలు అయినాయి. వైదిక నిష్టా గరిష్ఠుల కుటుంబంలో జన్మించి వైష్ణవ మతాచార్యుడు అయిన జగద్గురు, మహాప్రభు శ్రీమత్‌ వల్లభాచార్య, భారతావనిలో శుద్ద అద్వైతాన్ని పాటించే పుష్టి మత స్థాపనాచార్యులు అయినారు. క్రీస్తుశకము 1479 లో (విక్రమార్క శకం 1535) చైత్ర కృష్ణ పక్ష ఏకాదశి( వరూధిని ఏకాదశి) నాడు లక్ష్మణ భట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా వల్లభులు అవతరించారు. 100 సోమ యాగాలు చేశాక, తాను తమ వంశములో ఉదయిస్తానని శ్రీకృష్ణ భగవానుడు, వల్లభుని పూర్వజులైన యజ్ఞనారాయణాచార్యులకు తెలిపారు. ఆ ఆదేశానుసారం, ఆయన తరువాతి వారైన లక్ష్మీనారాయణ భట్టు, శతాధిక సోమ యాగాలు పూర్తి చేసిన క్రమంలో, కాశీలో వల్లభుడు భూమిపై అవతరించారు. బాల్యం నుండే వేదాలు ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు పఠించి, తర్వాతి కాలంలో, ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్య, బౌద్ధ, జైన సిద్ధాంతాలపై ఆమూలాగ్ర అవగాహన పొంది, దేశం నలుమూలల పర్యటించి, భక్తి మార్గం నిర్దేశకులు అయినారు. ”భగవత్‌ సాన్నిహత్య సాధనకు సాధువులే కానక్కరలేదని, కౌటంబిక జీవన విధానంలోనూ, కృష్ణ భగవానుని భక్తితో కొలిస్తే, ముక్తి లభించగలదని”, కొత్త సంప్రదాయానికి పురుడు పోసారు.
భారతావనిలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లాంటి చోట్ల ” కొత్త ప్రతిపాదన” ప్రభావం చూపి, వందలాది మంది వల్లభుని అనుసరించారు. వైష్ణవ మత వ్యాప్తికి, నడుము బిగించి, దేశాటన చేస్తూ, వివిధ చోట్ల భిన్న మతస్థులతో వాదోపవాదాలు జరిపి, తన మతానికి వారిని మళ్ళించారు. శ్రీకృష్ణ దేవరాయల దర్బారులో, మధ్వాచార్య, శంకరాచార్య అనుయాయుల మధ్య జరిగిన చర్చలలో పాల్గొని, 27 రోజులు విస్తృతంగా చర్చించి, వ్యతిరేకించిన వారిని ఓడించి, సభికులను ఒప్పించి, మెప్పించి, కనకాభిషేకం చేయించుకున్నారు. అదే సమయంలో, ఆచార్య ”జగద్గురు” బిరుదాంకితులు అయినారు. ఉజ్జయిని, ప్రయాగ, కాశీ, హరిద్వార్‌, బద్రీనాథ్‌, కేదార్నాథ్‌ తదితరాలను సంద ర్శించి, చివరకు మధుర వద్ద, బృందావనంలో కొంతకాలం గడిపారు. శ్రీకృష్ణుడు స్వప్న సాక్షాత్కారియై, గోవర్ధనగిరిపై శ్రీనాథ విగ్ర#హం కలదని, దాన్ని వెలికి తీసి, ఆలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేసి, పూజాదికాలు జరిగేలా చూడాలని చేసిన ఆదేశానుసారం, 1520 లో శ్రీనాథ ఆలయం నిర్మించారు.
అందుకే వల్లభుని మతాన్ని ”శ్రీనాథ మతం” అంటారు. ఆయన చివరికి కాశీలో స్థిరపడ్డారు. బాదరాయణ బ్రహ్మ సూత్రాలకు, జైమినీ పూర్వ మీమాంస సూత్రాలకు, అనుభాష్యం రచించారు. భాగవత దశమ స్కందానికి సుబోధిని వ్యాఖ్యాన గ్రంథ రచన చేశారు. మధురాష్టకం, చతు శ్లోకీ, వచనామృతం, భాగవత ఏకాదశ స్కంధ అర్థ నిరూపణ కారిక, భక్తి వర్ధిని, అంత:కరణ ప్రబోధ, సిద్ధాంత రహస్యం, పుష్టి ప్రవాహ మర్యాద, శ్రీకృష్ణ జన్మ పత్రిక, పురుషోత్తమ స#హస్రనామాలు, యమునాష్టకం, సిద్ధాంత ముక్తావళి, నవరత్నం లాంటి గ్రంథాలు ఎన్నో విరచించారు. శంకరాచార్యుని సిద్ధాంతాలతో విభేదించి, మాయావృతం కాని పరబ్రహ్మమే పరమ సత్యమని ప్రతిపాదించిన కారణంగానే, ఆయన వాదానికి శుద్ధ అద్వైతం అనే నామం శాశ్వతమైంది. పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కాగా, జీవుడు సత్‌ చిత్‌ రూపం మాత్రమే. జీవుని నుండి, ఈశ్వరుడు ఆనందాన్ని మరుగు పరిచాడు. అందుకే జీవుడు అజ్ఞాన వశుడై, సంసార బద్ధుడై, దు:ఖ బాధితుడు అవుతున్నాడు, అని తాత్విక చింతనను మిగుల ప్రచారం చేశారు. 1531లో తమ 52వ ఏట శ్రీనాధుని అజ్ఞానువర్తియై, ప్రాపంచిక జీవితాన్ని వదిలి గంగానదిలో జల సమాధి అయినారు.

రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement