Monday, April 29, 2024

శరణాగత త్రాణా

97. శ్రీయుత జానకీ రమణ! చిన్మయ రూప! రమేశ! రామ నా
రాయణ పాహిపాహియని ప్రస్తుతి చేసితి నా మనంబునన్‌
పాయక కిల్చిష వ్రజ విపాటన మందగజేసి సత్కళా
దాయి ఫలంబు నాకిడవె, దాశరథీ! కరుణాపయోనిధీ!

తాత్పర్యం: ఓ దశరథ రామా! భద్రగిరి రామచంద్రా! జానకీ పతీ! లక్ష్మీయుతా! జ్ఞాన స్వరూపా! ఓ రామా! నారాయణా! నిన్ను నేను ‘పాహి పాహి’ అని శరణువేడాను. (స్తుతించాను) నా మనస్సులో స్థిరంగా నిలిచి నాలోని దోషాలను/ పాపాలను ఖండించి మంచి కళకు లభించే ఫలితాన్ని నాకియ్యవయ్యా!

విశేషం: గోపన్న ఈ పద్యంలో రామచంద్రుని పలువిధాలుగా సంకీర్తన చేశాడు. శ్రీయుత అనడంలో సమస్త సంపదలకు స్వామియే నిలయమని గుర్తు చేశాడు. ఆయన జానకీ సతికి రమణుడు. లక్ష్మీపతి. శరణాగతత్రాణ పరాయణుడు. రామ శబ్దం పరమ పవిత్రం. దానిని జపించినా, లిఖించినా, స్మరించినా పాపాలు తొలగిపోతాయి. అట్టి రాముని నామ సంకీర్తనంతో కవి ప్రసన్నుని చేసుకోదలచాడు.

డాక్టర్‌ రేవూరు అనంతపద్మనాభరావు
98665 86805

Advertisement

తాజా వార్తలు

Advertisement