Thursday, May 16, 2024

ధర్మం… అతి సూక్ష్మము

ధర్మము అంటే శ్రేయస్సును కలిగించేది. ధర్మాన్ని మొద ట నిర్వహించి, ఆచరించింది సనాతన పథం. సృష్టి ధర్మంపైనే ఆధారపడి నడుస్తుంది. ధరిత్రికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మన భూమి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. అలాగే అనేక సూర్యులు నక్షత్ర మం డ లాధిపతులై కృష్ణ బిల రూపమైన పరబ్రహ్మం చుట్టూ పరిభ్రమి స్తున్నారు. ఈ అనంత విశ్వంలో మనం నివసించే భూమి దానిపై మన ఉనికిని ఊహించుకొంటూ పరమాణు సాటి కూడా చేయము. కానీ మానవుని ఆలోచన బ్రహ్మాండాన్ని మించి వుండడం ఆశ్చ ర్యం. పరమ ఉత్కృష్టమైన మానవజన్మకు సృష్టికర్త చేసిన నిర్దేశనం ధర్మాచరణ . సనాతన దృక్పథంలో ధర్మం వ్యక్తి జీవితంలో ఆనం దం, సంతృప్తిని సాధించడానికి మార్గం. అవి పొందాలంటే ముం దు ఇతరుల ఆనందానికి, సంతృప్తికి భంగం వాటిల్లకుండా చూడ డమే ధర్మ స్వరూపం.
శాస్త్ర విహిత కర్మలు ధర్మం అనబడతాయి. మన నడవడి, క్రియలు, చేష్టలు, వృత్తి ఇతరులకు హాని చేసేవిగా ఉండ కూడదు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలను, సంఘ నియమాలను అనుస రించాలి. స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, దానం, ఔదార్యం, దయ, అహింస, నిగ్రహం, క్షమాగుణం, శుచి, సత్సం కల్పం, దైవారా ధన, సృష్టికి లోబడి ప్రవర్తించడం మొదలైనవి ధర్మము.
ధర్మము చాలా సూక్ష్మమైనది. ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది. కానీ అంతిమంగా అది మానవుని మనుగడను, శ్రేయస్సును కోరుకుంటుంది.
ధృతి: క్షమాదమోస్తేయం. శౌచ మింద్రియ నిగ్రహ:
హ్రీర్విద్యా సత్య మక్రోధ: ఏతత్‌ ధర్మ లక్షణమ్‌
ధృతి, క్షమాదమోస్తేయం, శౌచ మింద్రియ నిగ్రహం, హ్రీ: (సిగ్గు), విద్య, సత్యం, అక్రోధం ఇవి ధర్మం లక్షణాలు.
ధృతి అనగా పట్టుదల, దీక్ష, ఓర్పు, మనస్సు లగ్నం చేయడం, తెలియని విషయాలు పెద్దలనుండి, శాస్త్రం నుండి తెలుసుకోవడం.
క్షమ అనగా తప్పును తెలుసుకుని శరణువేడిన వారిని క్షమిం చడం, సకల జీవుల పట్ల క్షమ కలిగియుండుట.
దమమనగా మనసు, మాట, శరీరమును అదుపులో నుంచు కొనుట. అస్తేయమనగా పరుల సంపదను కోరకుండుట, అపహ రింపకుండుట. శౌచమనగా భౌతికముగాను, అంతరంగికము గాను కల్మషం లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం.
ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవడం. మనోదౌర్భల్యా నికి లోనుకాకపోవడం, విద్యావంతులై ఉండాలి. విద్యావిహీనులు పశువుతో సమానం. మానవులకు విద్య ఒక నేత్రం. అప్పుడే సత్య వ్రతుడై ఉండగలడు. పగ, కోపం, హింస, ప్రతీకారం, ఇవి పతనా నికి హేతువులు. కావున విడనాడాలి.
గురు ధర్మం అంటే వాత్సల్యముతో శిష్యునికి శాస్త్ర బోధ చేయుట. సమాజ హితము చేకూర్చేవిధంగా శిక్షణనిచ్చుట. శిష్య ధర్మమనగా గురు శుశ్రూష చెెస్తూ గురువును దైవ సమానమనుని గా భావించి విద్య నభ్యసించుట. వృత్తి ధర్మమంటే సమాజ శ్రేయ స్సును కోరే వృత్తిని చేపట్టడం.
యజమాన ధర్మం అంటే కుటుంబం లేదా వ్యవస్థను తన కంటికి రెప్పలా చూసుకోవడం. గృహిణి ధర్మం భర్త, సంతానము పట్ల విధేయురాలై పూజ్య స్థానం సంపాదించటం. సమాజానికి ఆద ర్శంగా నిలవటం. సైనిక ధర్మం అంటే దేశసేవయే పరమావధిగా, దేశ రక్షణ అంతిమ లక్ష్యంగా సదా వీర స్వర్గమలంకరించటానికి సిద్ధంగా ఉండటం. పుత్ర ధర్మం అంటే తల్లిదండ్రులను, తోబుట్టు వులను ప్రేమానురాగాలతో చూడటం, తల్లిదండ్రులకు ఆనందా న్నివ్వడం. పితృధర్మం అంటే కుటుంబాన్ని కాపాడుతూ అభివృద్ది చేయటం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పంచుకోవ డం సంసార ధర్మం. భార్య భర్తలు నిండునూరేళ్ళు కష్టసుఖాలలో పరస్పరం పాలు పంచుకోవడం వివాహ ధర్మం.
మిత్ర ధర్మం అంటే నమ్మిన స్నేహితునికై ప్రాణ త్యాగం చేయ డం. పురుష ధర్మం అంటే సకర్మలను ఆచరించటం. మానవతా ధర్మమంటే సత్యం పలుకుతూ అసహాయుల్ని, జీవుల్ని కాపాడటం.
ధర్మ ఏవహతో హంతి ధర్మో రక్షితి రక్షిత:
తస్మాద్ధర్మోన హంత వ్యోమానో ధర్మో హతో వధీత్‌!
ధర్మాన్ని నాశనం చేస్తే అది మనలను నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మాన్ని ఉల్లం ఘించకూడదు. ధర్మాన్ని అతిక్రమించి నాశనం చేయకూడదు. మనలను అది అణచి వేయకూడదని సనాతనం ఘోషిస్తున్నది.
మరణానంతరం కూడా విడిచి పెట్టకుండా వచ్చేది ధర్మము. అదే నిజమైన మిత్రుడు. ధన, వస్తు, వాహన, బంధు వర్గము శరీరముతో పాటే విడిచిపోతాయి
తిక్కన్న నిర్వచించిన ధర్మాన్ని పరిశీలిస్తే దాని సూక్ష్మం తెలుసుకోవచ్చు.
ఒరులేయవి యొనరించిన నరవర!
యప్రియము తన మనంబున కగుతౌ
నొరల కవి సేయకునికి యె
పరాయణము పరమ ధర్మపథముల కెలన్‌
ఇతరులు ఏ పనిచేస్తే నీ మనసుకి కష్టం కలుగుతుందో అటు వంటి పనిని ఇతరుల పట్ల నువ్వు చేయకుండా ఉండటమే ఉత్తమ ధర్మము. ధార్మికుని ఆలోచన ఎప్పుడూ హింసను తగ్గించడం ఎలా? అని ఉండాలి తప్ప హింసను పెంచుట ఎట్లు? అని ఉండ కూడదు. యుగయుగాన అధర్మం విజయం సాధించడం అసా ధ్యం. అంతిమ విజయం ధర్మానిదే!
అధర్మ ఫలితాన్ని వారు అనుభవించకపోయినా వారి కుమా రులు, మనుమలు తప్పనిసరిగా అనుభవిస్తారు. అది చాలా దుర్భరం. ఏనాటికైనా అధర్మపరులు సపరివారంగా అంతమవ డం ఖాయం. అది గీతాచార్యుని ప్రతిజ్ఞ.
యదా యదాహి: ధర్మస్య గ్లానిర్భవతి భారతా!
అభ్యుత్దానమధర్మస్య తదాత్మానం సృజామహమ్‌
పరిత్రాణాయా సాధునాం వినాశాయ చదుష్కృతామ్‌!
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!
ధర్మానికి ఆపద వచ్చిన ప్రతీక్షణం అధర్మపరులను నాశనం చేయడానికి భగవానుడు సిద్ధంగా ఉంటా డనేది పరమ సత్యం.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement