Sunday, May 5, 2024

బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌

ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చేసిన విధంగానే బ్యాంక్‌ల విషయంలోనూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రయివేటకరణకు, సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడాయిల్‌పై విండ్‌పాల్‌ ట్యాక్స్‌ పరిశ్రమ వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. విండ్‌పాల్‌ ట్యాక్స్‌ విధించాలని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుందని అనడం సరికాదన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షించాలన్న పరిశ్రమ వర్గాల సూచన మేరకే ముందుకుకెళుతున్నామని ఆమె స్పష్టం చేశారు. పరిశ్రమ వర్గాలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అదనపు పెట్టుబడులు లేకుండానే చమురు సంస్థలకు లభిస్తున్న ఆయాచిత లద్దిపై ఈ సంవత్సరం జులై 1 నుంచి సుంకాన్ని విధించారు.

కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ప్రభుత్వానికి నిధుల ప్రవాహం అనుకున్న స్థాయిలో ఉండటంలేదన్నారు. ప్రస్తుతం ట్యాక్స్‌-జీడీపీ నిష్పత్తి 10 శాతంగా ఉందని, దీన్ని పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. పన్ను పరిధిని విస్తరించడానికి చాలా చర్చలు, విశ్లేషణలు అవసరమని చెప్పారు. ప్రయివేటీకరణకు, బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు అమలు చేస్తామన్నారు. ఎల్‌ఐసీ తరహాలో బ్యాంకింగ్‌ రంగంలోనూ ముందుకు వెళ్తమని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల్లో వందో స్వాతంత్య్ర దినో త్సవం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాల్సి ఉందన్నారు. ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు, సుస్థిరాభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. ఇందుకోసం డిజిటైజేషన్‌, విద్య, మౌలికసదుపాయాల కల్పన పెరగాల్సి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. సుస్థిర అభివృద్ధి సాధించేందుకు మరింత అప్రమత్తత, స్థిరమైన ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు. కరోనా తరువాత కూడా ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement