Monday, May 6, 2024

ఐటీ మెగా విలీనం, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ ట్రీ డీల్‌.. టెక్‌ మహీంద్రా కంటే పెద్ద సంస్థగా

ప్ర‌భ‌న్యూస్ : కార్పొరేట్‌ సెక్టార్‌లో ఓ కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌ తరహాలోనే రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు విలీనం అయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా వేరేరుగా ఉంటూ వచ్చిన ఈ రెండు కంపెనీలు కూడా ఇప్పుడు లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) కింద వచ్చి చేరాయి. ఈ రెండు సాఫ్ట్ వేర్‌ కంపెనీలు విలీనమైనట్టు ఎల్‌ అండ్‌ టీ శుక్రవారం ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియను ధృవీకరించింది. ఈ మేరకు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. విలీనమైన ఈ రెండు కంపెనీలు.. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందినవే.. ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ ట్రీ. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు తాజాగా విలీనం అయ్యాయి. విలీనం తరువాత.. టెక్‌ మహీంద్రా కంటే పెద్ద సంస్థగా ఇది ఆవిర్భవించనుంది. ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌కు దేబశీష్‌ ఛటర్జీ, మైండ్‌ ట్రీకి సంజయ్‌ జలోనా సారథ్యం వహిస్తున్నారు. ఇది వరకు బ్యాంకింగ్‌ సెక్టార్‌లో పెద్ద ఎత్తున విలీనాలు జరిగేవి. కొద్ది రోజుల క్రితమే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ – మైండ్‌ ట్రీ విలీనం ఖరారైంది. ఎల్‌ అండ్‌ టీ సబ్సిడయరీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీస్‌ సరీస్‌ కంపెనీ మైండ్‌ ట్రీ.

టెక్నాలజీ రంగంలో మెగా విలీనం..

ఈ టెక్నాలజీ రంగంలో అతిపెద్ద విలీనంగా చెప్పుకోవచ్చు. విలీనం తరువాత.. ఈ రెండు కంపెనీలు ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ పేరుతో ఒకే సంస్థగా ఆవిర్భవిస్తాయని ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ ప్రకటించారు. కస్టమర్స్‌, ఇన్వెస్టర్స్‌, షేర్‌ హోల్డర్స్‌, ఉద్యోగులు ఏ ఒక్కరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా విన్‌ టు విన్‌ ప్రాతిపదికన విలీన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ రెండు కంపెనీలు వేర్వేరుగా పని చేస్తుండటంతో కొన్ని నివారించదగ్గ లోపాలు తలెత్తుతున్నాయని, చిన్న చిన్న ఓవర్‌ల్యాప్స్‌ ఉంటున్నాయని చెప్పారు. ఏకీకృతం కావడంతో మరింత బలోపేతం అవుతాయని వ్యాఖ్యానించారు. మార్కెట్‌లో ఉన్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవడం, ఖర్చును నియంత్రించుకోవడం.. వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎల్‌ అండ్‌ టీ టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు కూడా ఎల్‌ అండ్‌ టీకి చెందినవే. ఈ రెండు కంపెనీల వ్యాపార లావాదేవీలను 3.5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే ఉద్దేశంతో విలీన ప్రక్రియను ప్రారంభించినట్టు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీకి ప్రతిపాదనలు పంపింది. దీనిపై షేర్‌ హోల్డర్లు, రెగ్యులేటరీ ఇంకా తన ఆమోదాన్ని తెలియజేయాల్సి ఉంది. నెల రోజుల్లో ఆమోదం లభించొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement