Wednesday, May 15, 2024

AP | ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు.. జగన్ పై చంద్ర బాబు

కర్నూల్ బ్యూరో : ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన ప్రతి ఒక్కరిని బాధించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం పత్తికొండలో నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తుంది. రా కదిలిరా .. సభను ఉద్దేశించి తేదీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళుగా ప్రజలను హింసించడం తప్ప ఏం చేయలేదన్నారు.సైకో జగన్మోహన్ రెడ్డికి పత్తికొండ సభను చూస్తే రాత్రికి నిద్రరాదన్నారు. టీడీపీ-జనసేన కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని పత్తికొండ సభను చూస్తే అర్థమవుతోంది.

“రా కదలిరా” అంటే జనసముద్రంలా కదలివచ్చారు. నా జీవితంలో ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. జగన్ రెడ్డికి ఎక్కువ సీట్లు కట్టబెట్టిన కర్నూలుకు వైసీపీ ఒరగబెట్టిందేమీ లేదు. సంపద సృష్టించడం చేతగాదు కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పీహెచ్ డీ చేశారు. జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అని చెప్పాలి. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. బీసీలకు జగన్ రెడ్డి ఏమాత్రం న్యాయం చేయలేదు. అన్ని పథకాలను రద్దు చేసి బీసీల గొంతు కోశారు.

వైసీపీని ఓడించడానికి ప్రజలు “సిద్ధంగా” ఉన్నారు

కర్నూలు నుంచి నిత్యం వలసలు వెళ్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వలసలను అరికడతాం. వెనుకబడిన వర్గాలకు చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం. యనమల నుంచి అనేక మంది బీసీ నాయకులను అందించాం. బీసీలను అన్ని విధాల ఆదుకునే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. నేడు బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయి. తన సోదరిని వేధిస్తున్నారని అడిగిన అమర్ నాథ్ అనే వ్యక్తిని దహనం చేశారు. కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలేదు.

బీసీలపై దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేవు. కోడికత్తి కేసు డ్రామా మనం చూస్తున్నాం. కోడికత్తి శ్రీను ఐదేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. జగన్ రెడ్డి బాబాయిని చంపిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతున్నాడు. సిద్ధం అని సభ పెట్టారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు “సిద్ధంగా” ఉన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. హైదరాబాద్, బెంగళూరుకు వలసవెళ్లే పనిలేకుండా వర్క్ ఫ్రమ్ హోం కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

- Advertisement -

మీ భవిష్యత్ ను బంగారు భవిష్యత్ చేస్తాం

ఎన్నికలకు 73రోజుల సమయంఉంది. ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు. 73 రోజుల పాటు సైకిలెక్కి, జనసేన జెండా పట్టుకుంటే మీ భవిష్యత్ ను బంగారు భవిష్యత్ చేస్తాం. ఇండియా టుడే ఇంటర్వూ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. జగన్ రెడ్డి ఎక్కడ చదివారో కూడా తెలియదు. బిల్డప్ మాత్రం ఎక్కువ, సబ్జెక్టు మాత్రం ఏమీ ఉండదు.

మైనార్టీలను నిర్లక్ష్యం చేశారు. గతంలో ఉన్న పథకాలను రద్దు చేశారు. ముస్లీంలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. వేధింపులు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పులివెందులలో జగన్ గెలిచి చూపించాలి. ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి పారిపోయారు. వైసీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. అభ్యర్థులను మారుస్తున్నారు. చెత్త ఎక్కడైనా చెత్తే. మార్చాల్సింది అభ్యర్థులను కాదు జగన్ రెడ్డిని.

రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియవు

టీడీపీ తీసుకువచ్చిన 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. జగన్ రెడ్డి పాలనలో నాతో సహా అందరూ బాధితులే. వంచనకు గురైన ప్రతి ఒక్కరు జగన్ రెడ్డిని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఊరిని, ఇంటిని నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. రద్దులు, గుద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప జగన్ రెడ్డికి ఏమీ తెలియవు. కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం. సోలార్ పవర్ వ్యవస్థను ను ముందుకు తీసుకెళ్తాం. జే-బ్రాండ్లతో నాసిరకం మద్యం తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మద్యం పేరుతో ప్రజల రక్తాన్ని తాగే జలగ జగన్మోహన్ రెడ్డి. అక్రమ ఇసుక తవ్వకాలతో వేలకోట్లు దోచేస్తున్నారు.

గోదావరి నీటిని రాయలసీమను తీసుకువస్తాం

నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెరిగాయి. చెత్తపైనే పన్ను వేస్తున్నారు. టీడీపీ హయాంలో రాయలసీమలో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి నిధులు ఇచ్చాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.1800 కోట్లు ఖర్చు పెట్టాం. డోన్, పత్తికొండలో సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం రూ.260 కోట్లు శాంక్షన్ చేశాం. హంద్రీ-నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. వేదావతి పూర్తిచేస్తే మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి. గోదావరి నీటిని రాయలసీమను తీసుకువస్తాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీరివ్వాలనుకున్నాం. అన్నింటిని నాశనం చేశారు.

ఓటుతో జగన్ రెడ్డి అనే భస్మాసురుడిని ప్రజలు వధించాలి

ఈ ప్రజలే జగన్ రెడ్డి పతనానికి స్టార్ క్యాంపెయినర్లు. ఐదుకోట్ల మంది జగన్ రెడ్డి బాధితులే. డ్రామాలు ఆపాలి. నిన్నటి వరకు బెదిరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి అంతు ప్రజలు చూస్తారు. తనకు పేవర్ లేదు, టీవీ లేదని అంటున్నారు. అన్నీ అబద్ధాలే. కలియుగ భస్మాసురుడు జగన్ రెడ్డి. ఓటుతో జగన్ రెడ్డి అనే భస్మాసురుడిని ప్రజలు వధించాలి. మహిళలకు మహాశక్తి కార్యక్రమం తీసుకువచ్చాం. నెలనెలా ప్రతి మహిళకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ చదివిస్తాం.

3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతులకు అన్నదాత కింద ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. డ్రిప్ యంత్రాలతో పాటు అన్ని విధాలా రైతులను ఆదుకుంటాం. బీసీ రక్షణ చట్టం తీసుకువస్తాం. సామాజిక న్యాయం చేసిన పార్టీ టీడీపీ. 95-96లో ఎస్సీల్లో వర్గీకరణ తీసుకువచ్చాం. దీంతో మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది. కేంద్రం కూడా వర్గీకరణ చేస్తామంటోంది. టీడీపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. మైనార్టీలనూ ఆదుకుంటాం.

కర్నూలులో వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. భూములు, ఇసుక, ఎర్రమట్టి ఏదీ వదలడం లేదు. సుధాకర్ సీటు విష్ణువర్థన్ రెడ్డి పెత్తనం పెరిగిపోయింది. కర్నూలులో హఫీజ్ ఖాన్ అవినీతిలో కింగ్ ఖాన్. వక్ఫ్ భూములు కొట్టేసారు. మార్పుకు ప్రజలు సిద్ధంగా ఉంటే అభివృద్ధి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కొబ్బరికాయలు కొట్టలేని వాళ్లు కూడా నా గురించి మాట్లాడతారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డ్ నాది. నష్టపోయిన ఏపీని బాగుచేసే బాధ్యత తనదిగా పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement