Friday, April 26, 2024

ఆచంటలో టీడీపీ- జనసేన పొత్తు… మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

ఏపీలో జడ్పీ ఛైర్మన్‌లు, ఎంపీపీల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న అధికార వైసీపీ.. ఆచంట ఎంపీపీ ప‌ద‌విని మాత్రం కోల్పోయింది. ఆచంట ఎంపీపీ పదవిని జనసేన మద్దతుతో టీడీపీ కైవ‌సం చేసుకుంది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంట‌లో టీడీపీ 7 చోట్ల‌, వైసీపీ 6 చోట్ల‌, జ‌న‌సేన 4 చోట్ల విజ‌యం సాధించింది. ఎంపీపీ ప‌ద‌వి కోసం టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా ఎంపీపీ ప‌ద‌వి టీడీపీకి, ఉప ఎంపీపీ ప‌ద‌విని జ‌న‌సేన పార్టీ ద‌క్కించుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీ-జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు టీడీపీ-జనసేనలు కలవాల్సిన పరిస్థితి ఉందన్నారు. టీడీపీ-జనసేన పార్టీ కలిసి పనిచేయడం మంచి పరిణామం అని తెలిపారు. ఆచంట నుంచే అది ప్రారంభమైందని చెప్పారు. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. రాష్ట్రంలో  వైసీపీ వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. టీడీపీ, జనసేన ఇలా ఇతర పార్టీలకు చెందినవారు ఉంటే.. వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement