Sunday, April 28, 2024

Special Story: ఉద్యోగం​ వదిలేసి, సాగుబాట పట్టింది.. ఆదర్శ మహిళా రైతు సుజాత..

ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అన్నిటా సగం.. ఆమె ఈ జగంలోనూ సగం.. అని ఎలుగెత్తి చాటింది బౌద్ధం. గౌతమ బుద్ధుని కాలానికి మహిళలకు ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక స్వాతంత్య్రం లేదు. స్త్రీ ఒక భోగవస్తువుగా మారుతున్న కాలం అది. ఇతర సాధారణ కుటుంబాల మాట ఎలా ఉన్నా రాచరిక కుటుంబాల్లో మాత్రం ఆడపిల్ల పుట్టడం అంటే అనర్థంగానే భావించేవారు. తమ రాజ్యంలో ఆస్థికి కానీ, అధికారానికి కానీ ఆడపిల్లలను వారసులుగా రాచరిక వ్యవస్థ గుర్తించకపోవడమే దీనికి కారణం.  కానీ, ఇప్పుడు ఒకప్పటి కాలం మారింది.. ఆధునిక కాలం నడుస్తోంది.. విమెన్​ పవర్​ ఏంటో సమాజం గుర్తిస్తోంది. ఇంకా కొన్నిచోట్ల సాంఘిక దురాచారాలు, సామాజిక కట్టుబాట్ల పేరుతో ఆడాళ్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా వాటన్నిటినీ దాటుకుని కొంతమంది ముందడుగు వేస్తూ.. నవ సమాజానికి కొత్త దారి చూపుతున్నారు.

ఆమె పేరు లక్ష్మి సుజాత.. చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్​ ( పీజీ). ప్రైవేట్​ స్కూల్​ ప్రిన్సిపాల్​​గా మంచి ఉద్యోగం.. యాభై వేలకు పైగానే జీతం. అయితే.. ఇవేమీ ఆమెకు తృప్తి నివ్వలేదు. తన తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే భవిష్యత్తు బాటగా అనిపించాయి. తండ్రిలా వ్యవసాయంలో రాణించాలనే తపనతో సెటిల్డ్​ జాబ్​ని వదిలి నేలతల్లి వైపు అడుగులేసింది. రాళ్ల పొలాన్నే రతనాల భూమిగా మార్చి, ఏడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోంది. విమర్శించిన వారి నోటనే శభాష్‌ అనిపించుకుంటోంది. పేద మహిళలకు ఉపాధి చూపుతూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. మరి లక్షి సుజాత స్టోరీ ఏంటో చదివి తెలుసుకుందామా..

ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం తిమ్మ సముద్రానికి చెందిన బడ్డుపాటి నాగభూషణానికి ముగ్గురు కూతుళ్లు. వారిలో లక్ష్మి సుజాత రెండో కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచి  తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లేది. నాగభూషణం ఇంట్లో కన్నా ఎక్కువగా పొలంలోనే గడిపేవాడు. నేలతల్లే కన్నతల్లి అని భావించే ఆయన.. చనిపోయేంత వరకూ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఏనాడూ సాగు వదిలి ఇతర పనులకు వెళ్లలేదు. ఆ క్రమంలోనే కూతుళ్లని మంచి చదువులు కూడా చదివించారు. బాగా స్థిరపడిన కుటుంబాల్లోకి పెళ్లి చేసి పంపారు. అయితే ఇద్దరు కూతుళ్లు తండ్రి వారసత్వంగా వ్యవసాయం చేయడం అలవర్చుకున్నారు. కానీ, లక్ష్మి సుజాత మాత్రం పైచదువుల నిమిత్తం తెలంగాణలోని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

పెళ్లి తర్వాత అక్కడే ఓ స్కూళ్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఎంతో మంది పిల్లలకు చదువు చెప్పారు. మంచి జీతం పొందారు. కానీ, మనసులో ఏదో వెలితి. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన తనకి వ్యవసాయం చేయాలని ఆశగా ఉన్నా.. పరిస్థితులు అనుకూలిస్తాయా? అన్న అనుమానం ఉండేది. ఏడేళ్ల క్రితం తండ్రి నాగభూషణం హెల్త్​ బాగా లేకుండా పోయింది. ఆయన్ని చూడ్డానికి వెళ్లిన లక్ష్మి సుజాతకి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఆయన చూపిన వ్యవసాయ మార్గంలోనే నడవాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని భర్త గిరిధర్‌ కుమార్‌ రామరాజు కూడా అర్థం చేసుకుని సహకరించారు. ఇక ఉద్యోగం విడిచి, తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు.

రాళ్ల భూమిలో సాగు..

- Advertisement -

చీమకుర్తి మండలం ఇలపావులూరు, గాడిపర్తివారిపాలెం, శివరాంపురం గ్రామాలకు దాదాపు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో 25 ఎకరాలు కొనుగోలు చేశారు. చుట్టూ కొండలు, మట్టి కన్నా రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ భూమి దేనికి పనికి రాదని, నష్టం వస్తుందని చుట్టూ పక్కల రైతులు, బంధువులు చెప్పారు. కొంతమంది ‘‘ఎహె.. మంచి జాబ్​ వదిలేసి ఇదేం తెలివితక్కువ పని”అని ముఖం ముందే విమర్శలు చేశారు. అయినా.. తండ్రి ఇచ్చిన ధైర్యం, తోబుట్టువుల చేయూత లక్ష్మీ సుజాతకు  బాధ కలగనివ్వలేదు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు రాళ్ల భూముల్లోనే పండ్ల తోట సాగు చేస్తే బాగుంటుందని భావించారు. భూమిని మెత్తగా దున్ని, మంచి మట్టిని తోలారు. అందులో మహారాష్ట్ర నుంచి భగవాన్‌ రకం దానిమ్మ మొక్కలను తెచ్చి ఐదు ఎకరాల్లో నాటారు. అంతర పంటగా లోక్నో 49 రకం జామ మొక్కలను వేశారు. దీంతో పాటు మరో ఐదు ఎకరాల్లో బత్తాయి, నిమ్మ పంటల సాగు కూడా చేపట్టారు. నీటి నిల్వ కోసం 2 ఎకరాల్లో పొలంలోనే పెద్ద పెద్ద రెండు కుంటలను తవ్వారు. బిందు సేద్యం విధానంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు మొదలు పెట్టారు. దీంతో జామ, దానిమ్మ కాయలు బాగా వచ్చాయి. మంచి ధర పలికి లాభాల పంట పండింది.  మరుసటి సంవత్సరం బొప్పాయి, దొండ, సొరకాయ వంటివి సాగు చేశారు.

సేంద్రియ ఎరువుల తయారీ..

హైదరాబాద్​ వంటి మహానగరంలో ఉండడం.. ఇక్కడి తిండి, అలవాట్లు తెలిసిన లక్ష్మీ సుజాత ఇకపై కెమికల్స్​ లేని కూరగాయలను అందించాలనుకున్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందులతో పండించిన పంటలతో కలిగే అనర్థాలపై అవగాహన ఉంది. ఎక్కువ లాభం కన్నా ఆరోగ్యం ముఖ్యమని తండ్రి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేదు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేశారు. వేప, ఆముదపు పిండి, ఆవు పేడ, గో మూత్రం ఉపయోగించి ఎరువులు తయారు చేయించారు. పిచికారీ కోసం వేప కషాయం, మజ్జిగ, శనగ పిండి, నల్లబెల్లం ఉపయోగించి మొక్కలకు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు పాటించారు. విప్ప పువ్వు నూనె, వేప నూనె కలిపి చీడపీడలు రాకుండా మొక్కలకు ఎరువుగా వేశారు. పొలంలోనే సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి మోటార్‌ ద్వారా మొక్కలకు నీళ్లు పెట్టారు. ఇట్లా అధునాతన టెక్నాలజీ వినియోగిస్తూనే.. పాత తరం సాగు పద్ధతును పాటించి మేలైన దిగుబడులు సాధించారు.

మహిళా కూలీలకు నిత్యం ఉపాధి..

లక్ష్మి సుజాత ఒక్కతే పనులన్నీ చూసుకోవడం కష్టం కావడంతో చెల్లెలు విజయలక్ష్మిని భాగస్వామురాలిగా చేసుకుంది. ఇద్దరూ రేయింబవళ్లూ కష్టపడ్డారు. పొలంలో రోజూ ఉండే పనుల కోసం దాదాపు 30 మంది మహిళా కూలీలను పెట్టుకున్నారు. సేంద్రియ ఎరువుల తయారీ, కలుపు తీయడం, మందుల పిచకారీ, కాయలు కోయడం వంటి పనులన్నీ మహిళలే చేస్తుంటారు. వీరికి రోజూవారీగా ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబ సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. వీరి కష్టం ఫలించి మొదటి సంవత్సరం 20 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 120 టన్నుల దిగుబడి వచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరం కోటిన్నర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తూ సంతోషంగా ఉన్నారు. వచ్చిన దిగుబడులను చెన్నై, హైదరాబాదు, ముంబై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. చుట్టూ పక్కల పండ్ల వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

పేద రైతుల కోసం సొసైటీ

లక్ష్మీ సుజాతకు వ్యవసాయం చేయడం ఒక ఎతైయితే పండిన పంటని మార్కెటింగ్‌ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. పంటని అమ్ముకునే క్రమంలో నష్టంతో పాటు సవాళ్లను ఎదుర్కొన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే పేద రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఊహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులను కలిశారు. వారి కష్టాలు, కన్నీళ్లు విని చలించిపోయారు. వారి కోసం ‘పీసెంట్‌ సొసైటీ’ ఏర్పాటుచేశారు. వారికి ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు, ఎరువుల తయారీపై సూచనలు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తూ… రైతుల అభివృద్ధికి సహకరిస్తున్నారు.

నాన్నే నాకు స్ఫూర్తి అంటున్న లక్ష్మి సుజాత:

మా నాన్న నాలుగేళ్ల క్రితం చనిపోయారు. వ్యవసాయ రంగంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన కష్టం నాకు బాగా తెలుసు. అందుకే పేద రైతులకు సహాయపడుతున్న. వారు నష్టపోకుండా పంటని కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తున్నా. ‘ప్యాసెంట్‌ ఆగ్రో’ సంస్థను ప్రారంభించి ఇతర రైతులకు దానిమ్మ సాగులో మెలకువలు నేర్పుతున్నాం. త్వరలో కావ్య ఆగ్రో పేరుతో దానిమ్మ, స్నాక్‌ ప్యాక్‌, జ్యూస్‌, జామ్‌ లాంటి ఉత్పత్తులను తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తాం.

  • సేకరణ..
Advertisement

తాజా వార్తలు

Advertisement