Sunday, May 5, 2024

నా కూతురు ఒంటరి పోరాటం చేస్తోంది, ఆమెకు సపోర్ట్​ కావాలే.. అందుకే రాజీనామా: వైఎస్​ విజయమ్మ

తన కుమార్తె షర్మిలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టిన తన కూతురు షర్మిలకు సపోర్ట్​ చేయడానికే ఈ రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్లీనరీ సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఆయన (వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి) కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆయన వెంటే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నా కొడుకు సంతోషంగా ఉన్నాడు. అక్కడ నా కూతురు (వైఎస్‌ షర్మిల) ఒంటరి పోరాటం చేస్తోంది. నేను ఆమెకు మద్దతు ఇవ్వకుంటే అన్యాయం జరుగుతుంది.. నేను ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నాను, నన్ను క్షమించమని అందరినీ అభ్యర్థిస్తున్నాను. అని విజయమ్మ సభా వేదికగా కోరింది.

తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని వైఎస్​ విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డి భార్యగా, షర్మిల తల్లిగా నేను ఆమెకు అండగా నిలవాలని నా హృదయం చెబుతోందని తెలిపారు. అంతకుముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీని నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి జి. అమర్‌నాథ్ అన్నారు. పార్టీకి 9అజెండాలు ఉంటాయని, అందులో 5 అంశాలపై నేడు (శుక్రవారం), 4 అంశాలపై రేపు (శనివారం) చర్చిస్తామని చెప్పారు. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.

ఇక.. రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఏర్పాటైన తర్వాత ఇది మూడో ప్లీనరీ అని, అయితే 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగడం ఇదే తొలిసారని అన్నారు. మొదటి రోజు (జూలై 8) ప్లీనరీకి సుమారు 1.5 లక్షల మంది ప్రతినిధులు హాజరవుతారని, రెండో రోజు (జూలై 9) దాదాపు 4.5 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement