Monday, April 29, 2024

AP | కోస్తాంధ్రకు వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్‌ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈనెల 20వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. బుధవారం అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్‌, పోల్స్‌ క్రింద ఉండరాదన్నారు.

పొలాలు, మైదానాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో అనంతపురంలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, కర్నూలు, కడప నంధ్యాల ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వర్ష సూచన జనానికి చల్లటి కబురుగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement