Thursday, May 2, 2024

కోరమీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు..

కొనకనమిట్ల : మండలంలోని గార్లదిన్నె సమీప కొండలలో వెలసియున్న శ్రీ వెలుగొండ వేంకటేశ్వరస్వామి, కోరమీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు 26వ తేదీ శుక్రవారం నుండి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ ఈ.ఓ ఈదుల చెన్నకేశవరెడ్డి, చైర్మన్‌ సానికొమ్ము తిరుపతిరెడ్డిలు తెలిపారు. ఈ క్షేత్రం నందు ముచికుంద మహర్షికి శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణ అవతారంలో ప్రత్యక్షమై మోక్షమిచ్చినట్లు, కాలయవనుడనే రాక్షసుడు ముచికుంద మహర్షి తపోగ్నికి అంతమైన అనంతరం పుణ్యక్షేత్రమై వెలుగొండ క్షేత్రంగా పేరుగాంచింది. ఈ దేవస్థానం కొండ మొదలు తిరుమల వర కు వ్యాపించి ఉన్న కొండలను వెలుగొండ అని భక్తులు పిలుస్తారు. ఈ కలియుగమున యుగపురుషుడు, భ క్తుల కోర్కెలు తీర్చేవాడు, ఆపద మొక్కులు తీర్చేవాడు, కల్పతరువు, మోక్షప్రదాత అయిన శ్రీ వెలుగొండ స్వామి బ్రహ్మోత్సవాలు పాంచరాత్రాగమానుసారంగా ద్వాదశాహ్నిక దీక్షతో జరుగుతాయని ఈ.ఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు. 26 శుక్రవారం రాత్రి అంకురార్పణ, 27 శనివారం పగలు ధ్వజారోహణ, రాత్రికి భేరిపూజ, దేవతాహ్వానం, కళ్యాణోత్సవం, ఉదయం సూర్యప్రభవాహనం, 28 ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనం, 29 సోమవారం వ్యాళి వాహనం, 30వ తేదీ మంగళవారం సింహ వాహనం, 31వ తేదీ బుధవారం హంస వాహనం, ఏప్రిల్‌ 1 గురువారం శేషవాహనం, 2న శుక్రవారం హనుమంతవాహనం, 3న గరుడ వాహనం, ఇదేరోజు సాయంత్రం మోహినీ ఉత్సవం, 4న ఆదివారం గజోత్సవం, 5న సోమవారం రథోత్సవం, 6న మంగళవారం అశ్వవాహనం, 7న బుధవారం పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రతీర్థం, ధ్వజఅవరోహణ, కుంభప్రోక్షణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈ.ఓ ఈదుల చెన్నకేశవరెడ్డి వివరించారు. అర్చకులు నంద్యాల ప్రసాదాచారర్యులు, కొడవటిగంటివెంకటాచార్యులు, ఆగమాచార్యులు నంద్యాల తిరుమలాచార్యులు, స్వామి వారికి అలంకరణ చేయువారు శ్రీపతి అప్పనాచార్యులు, స్వామివారికి కళ్యాణ వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు తాళ్లూరి దుర్గావెంకటేశ్వరరావు చే వ్యాఖ్యానం నిర్వహించడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement