Friday, May 3, 2024

ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి… అరెస్టులతో రాక్షసానందం: లోకేశ్

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఏపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షసానందం పొందుతున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు’ అని నారా లోకేశ్ అన్నారు.
 
‘సంగం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబం. ప్రభుత్వ అసమర్థ‌తను, దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామాని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలు. 5 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలవడం ఒక రికార్డ్ అయితే, చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ధూళిపాళ్ల నరేంద్రకి ప్రత్యేక స్థానం ఉంది. అక్రమ కేసులు బనాయించి నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదు’ అని లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి జ్యోతిర్మయిని  నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని లోకేశ్ చెప్పారు. ధూళిపాళ్లపై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్ రెడ్డికి, వైసీపీ యూనిఫామ్ వేసుకున్న కొంతమంది అధికారులకు కోర్టులో చివాట్లు ఖాయమని లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement