Sunday, May 5, 2024

తిరుప‌తి ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌న్న ఎంపీ గురుమూర్తి

దేశంలోనే అత్య‌ధిక ప‌ర్యాట‌క ఆదాయం వ‌చ్చేలా తిరుప‌తి ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని తిరుప‌తి ఎంపీ గురుమూర్తి అన్నారు. శనివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఈసంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ… తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిధిలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడ పర్యాటక శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందో అక్కడ అధికారులు ఆ లోపాన్ని అధిగమించి పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి పనిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రైవేట్ టూరిజం ఆపరేటర్స్, హోటల్ యజమానులందరూ ఒకరినొకరు సహకరించుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా లీడింగ్ టూరిజం కంపెనీలు, ఇండియా టూరిజం ఆఫీసులు తిరుపతిలో పెట్టించటానికి కృషి చేస్తామన్నారు.

భవిష్యత్ లో దేశంలోనే అత్యధిక పర్యాటక ఆదాయం ఆర్జించే విధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేయాలన్నారు. తిరుమలకు విచ్చేసే పర్యాటకులకు నెల్లూరు, చిత్తూరులలో బీచ్, ఆధ్యాత్మిక, ఏకో పర్యాటక ప్రదేశాలు చూసేలా ప్యాకేజీలను రూపొందించలన్నారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, వాహనాలు పార్కింగ్, మంచినీటి సౌకర్యం ఉండేలా సౌకర్యాలు కల్పించాలని, నిర్వహణ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ నెల 29వ తేదీ లోపు పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏయే అనుమతులు, నిధుల అవసరమ‌నేది నిర్దిష్టమైన ప్రతిపాదనలు సమర్పించాలని పర్యాటక, ఆర్కియాలజీ ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చిత్తూరు జిల్లా ఆసరా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, DFO ఈస్ట్ నరేంద్రనాథ్, DFO వైల్డ్ లైఫ్ పవనకుమార్, DFO సూళ్లూరుపేట రవీంద్రా రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ఈఓ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పర్యాటక శాఖ అధికారి చంద్రమౌళి రెడ్డి, టూరిజం డివిఎం గిరిధర్ రెడ్డి, ఆర్కియాలజీ, ఫారెస్ట్, రహదారులు భవనాలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement