Monday, May 20, 2024

Mangalagiri – ప్రభుత్వంపై కుట్ర – రాజకీయాల్లోనే మహా దారుణం – జ‌గ‌న్

ఆంధ్రప్రభ స్మార్ట్, మంగళగిరి ప్రతినిధి: – “ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం’’?అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ఘర్జించారు. అమరావతి ప్రాంతం మంగళగిరిలో ఈ సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిపై నిప్పులు చెరిగారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును తూర్పారబట్టారు. “వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే .. జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో.. అక్కడి వర్గాలు ఎక్కడ జగన్ ను తమ వాడిగా భావిస్తున్నారో.. అని అసూయతో కుట్రలకు తెర తీశారని ఆరోపించారు.

ఎన్నికల ముందే ఎన్ని కుట్రలో..

- Advertisement -

“ వీళ్లందరూ అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్లకుండా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి”అని వివరించారు. “ అంతే కాదు, మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తుంటే ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు.”అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం గొంతు పిసికే కుట్ర ఇది

“ మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి”అని మంగళగిరి ప్రజలను జగన్ కోరారు. మళ్లీ ఇలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. అని జగన్ అభ్యర్థించారు.

మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు ..

” మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి” అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి అభ్యర్థిని మురుగుడు లావణ్య, ఎంపీ అభ్యర్థి రోశయ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement