Friday, April 26, 2024

మంచిపనులు చేసేవారికి ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది – -ఎమ్మెల్యే సింహాద్రి

అవనిగ‌డ్డ – మంచి పనులు చేసే వారికి ప్రజా ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఇటీవల జరిగిన ఎన్నికలు రుజువు చేశాయని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద అవనిగడ్డ, నాగాయలంక మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ.19.47 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, బాధలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఈవిడత రూ.56.97 లక్షల సి.ఎం.ఆర్.ఎఫ్ నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఎవరైతే ప్రజల అవసరాల పట్ల అనుకూలంగా పని చేస్తారో వారి పై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉంటారని మొన్న జరిగిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలే దీనికి నిదర్శనం అన్నారు. అదేవిధంగా రాబోయే జెడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల్లో 90 శాతం సెగ్మెంట్లలలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్వక్తం చేశారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
రెండో దశ కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నందున నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సూచించారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం‌, శానిటేషన్ చేసుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున 45 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషషన్ వేయించు కోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ, నాగాయలంక తాసిల్దార్లు బి శ్రీను నాయక్, విమలకుమారి, అవనిగడ్డ పంచాయతీ సర్పంచ్ గొరుముచ్చు ఉమ, అవనిగడ్డ నాగాయలంక వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, భోగాది శేషగిరిరావు, అవనిగడ్డ, నాగాయలంక జడ్పిటిసి అభ్యర్థులు చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), మోకా బుచ్చిబాబు, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement