Wednesday, May 1, 2024

Supreme Court – భార్య ధ‌నంపై భర్తకు హక్కు లేదు – సుప్రీం కోర్టు సంచ‌ల‌న‌ తీర్పు

న్యూ ఢిల్లీ – స్త్రీ ధనంపై పూర్తి హక్కు మహిళలదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దానిపై భర్తకు నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘‘స్త్రీధనం అనేది సంబంధిత మహిళలకు చెందిన పూర్తి ఆస్తి, దాన్ని ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు’’ అని పేర్కొంది. కష్టకాలంలో భర్త తన భార్య స్త్రీధనాన్ని తీసుకున్నా దాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని స్పష్టం చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే, కేరళకు చెందిన ఓ మహిళకు 2009లో వివాహమైంది. పెళ్లి సమయంలో మహిళ కుటుంబం ఆమెకు 89 బంగారు నాణేలను ఇచ్చింది. భర్తకు రూ.2 లక్షల చెక్కును అందజేసింది. పెళ్లయిన మరుసటి రోజు ఆ బంగారు నాణేలను భద్రంగా ఉంచుతానని నమ్మబలికిన భర్త వాటిని తీసుకెళ్లి తన తల్లికి అప్పగించాడు. అనంతరం, తన అప్పులు కట్టుకోవడానికి వాటిని అమ్మేశాడు. కొన్ని రోజుల తరువాత ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త నుంచి తన బంగారాన్ని తిరిగి ఇప్పించాలంటూ సదరు మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది. తన బంగారాన్ని భర్త, అత్త దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు.

- Advertisement -

తన స్త్రీధనం పొందేందుకు చివరి ప్రయత్నంగా ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. ‘‘2009లో 89 బంగారు నాణేల రేటు రూ.8.90 లక్షలు ఉండేది. ఆనాడు వాటిని తీసుకుని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకుని రూ.25 లక్షలను భార్యకు భర్త చెల్లించాలి. ఈ పేమెంట్ ఆరు నెలల్లోగా జరగాలి, స్త్రీకి పుట్టింటి నుంచి వ‌చ్చిన ధ‌నాన్ని అత్తింటి వారు వాడుకునే హ‌క్కులేదు.. ఆ ధ‌నం పుట్టింటి వారు ఆమె అవ‌స‌రాల‌కు ఇచ్చింది. దీనిపై పూర్తి హ‌క్కులు ఆమెవే.. ఆమె నుంచి తీసుకున్న బంగారాన్ని అంతే మొత్తంలో గాని, ఇప్ప‌టి విలువ‌లో న‌గ‌దు రూపంలో వ‌డ్డీతో స‌హా చెల్లించాలి ’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement