Saturday, May 4, 2024

కేశినేనిపై తెలుగు త‌మ్ముళ్లు తిరుగుబాటు…చంద్ర‌బాబు ప్ర‌చారాన్ని బ‌హిష్క‌రిస్తామ‌ని వార్నింగ్…

విజ‌య‌వాడ – న‌గ‌ర పాల‌క సంస్థ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీలో విబేధాలు రోడ్డున ప‌డ్డాయి.. మేయ‌ర్ అభ్య‌ర్ధిత్వాన్ని ఎంపి కేశినేని నానీ కుమార్తె శ్వేత పేరును ప్ర‌క‌టించ‌డంతో కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు ర‌గిలిపోతున్నారు.. ఇన్నాళ్లు బ‌య‌ట‌ప‌డ‌ని నేత‌లు ఒక్క‌సారిగా మీడియా స‌మావేశం నిర్వ‌హించి కేశినేని నానీపై విమ‌ర్శ‌లు కురిపించారు.. వివరాలోకి వెళితే టిడిపి నేత‌లు బొండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా లు గ‌త కొంత‌కాలంగా కేశినేని తీరుప‌ట్ల అసంతృప్తితో ఉన్నారు.. తాజాగా రేప‌టి నుంచి చంద్ర‌బాబునాయుడు విజ‌య‌వాడ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ ఎన్నిక‌ల ప్ర‌చార షెడ్యూల్ ను కేశినేని నానీ ఖ‌రారు చేశారు.. ఈ నేప‌థ్యంలోనే ఈ ముగ్గురు నేత‌లు నానీ చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టారు.. టిడిపి అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ, కేశినేని నాని మాట్లాడే ప్రతిమాట కులహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కించపరిచే విధంగా ఉందన్నారు. పశ్చిమంలో కేశినేని పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం పని చేసిన నాయకులం తామని చెప్పుకొచ్చారు. కేశినేని ఏకపక్ష ధోరణితో కార్యకర్తలు, నాయకులు విసిగిపోయారన్నారు. టీడీపీకి బడుగు, బలహీనవర్గాలు పట్టుకొమ్మలని..అలాంటి వర్గాలను కేశినేని నాని నరికేస్తున్నార‌ని విమర్శించారు. టీడీపీ పార్టీకి బడుగు, బలహీనవర్గాలు కట్టుబానిసలు అనుకుంటున్నారా? అని నిలదీశారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు కేశినేని నాని తీరుపై తమను నిలదీస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళం తామని స్పష్టం చేశారు. చంద్రబాబును విమర్శించేలా అధికార పార్టీ నేతలు తిడుతుంటే నోరు ఎందుకు మెదపవు కేశినేని అని ప్రశ్నించారు. ‘‘కేశినేని కులానికి నువ్వు గొప్ప అయితే…మా కులాలకు మేము గొప్ప. నిన్ను చూసి మా కులలవారు ఓట్లు వేయరు…మేము చెబితేనే ఓట్లు వేస్తారు. మేము ఎప్పటికీ చంద్రబాబుకు, టీడీపీకి విధేయులం… కానీ ఆత్మాభిమాన్ని చంపుకుని పార్టీలో ఇమడలేం. బడుగు, బలహీనవర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా. ఆ రోజులు పోయాయి…బడుగు, బలహీనవర్గాలు తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారు అవుతాయి’’ అంటూ నాగుల్ మీరా హెచ్చరించారు. టిటిపి పొలిట్ బ్యూరో స‌భ్యుడు బొండా ఉమా మాట్లా డుతూ, తన కూతురుని మేయర్ చేయడం కోసమే ఆయ‌న ఇటువంటి తీరును కన‌బ‌ర్చుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కేశినేని కావాలో.. తామంద‌రం కావాలో తేల్చుకోవాలని ఆయ‌న‌ అల్టిమేటం జారీ చేశారు. చంద్ర‌బాబుకు కేశినేని నాని ముఖ్యం అనుకుంటే, తాము రేపు జరుగబోయే చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటామని ఆయ‌న చెప్పారు. కేశినేని నాని కులాల మధ్య, పార్టీ నేతల మధ్య వివాదాలు సృష్టిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీలో ఉన్నందుకే కేశినేని నాని గెలిచార‌ని, ఆయ‌న‌కు విజ‌య‌వాడ‌లో అంత‌గా స‌త్తా ఉంటే రాజీనామా చేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలిచి చూపించాల‌ని బోండా ఉమ స‌వాలు విసిరారు. ఆయ‌న అలా గెలిస్తే తాను విజ‌య‌వాడను వ‌దిలేసి కట్టుబట్టలతో వెళ్లిపోతాన‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. తమకెంతో బాధగా ఉందన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు. ‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement