Sunday, May 5, 2024

Janasena – జ‌గ‌న‌న్న విద్యా కిట్ల‌లోనూ భారీ అవినీతి – నాదెండ్ల మ‌నోహార్

మంగ‌ళ‌గిరి : జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను నేడు మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మనోహర్ ప్రదర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింద‌ని అంటూ జగన్ ప్రభుత్వం స్కాంలపై ఆధారాలతో సహా విమర్శలు చేశామని పేర్కొన్నారు. తాము ప్రస్తావించిన అంశాలపై జగన్ సమాధానం చెప్పలేదన్నారు. టోఫెల్, ఐబీ స్కాంలను బయటపెట్టామని.. జగనన్న పాల వెల్లువ పథకం పాపాల వెల్లువ అని ఆధారాలతో సహా వివరించామన్నారు.

జగన్ పాల వెల్లువ పథకం అమలుపై క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సిద్ధమని చెప్పినా మంత్రి సీదిరి ఏదేదో చెప్పారన్నారు. ఈ నెల 14 నుంచి రోజుకో శాఖలో జరుగుతున్న కుంభకోణం బయట పెట్టనున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జగనన్న విద్యా కానుక పేరుతో మరో కుంభకోణం జరిగిందని.. రూ. 1050 కోట్లతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు పంచుతున్నామని ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేశాయని.. ఉత్తర భారత దేశంలో ఈడీ దాడుల తీగ లాగితే ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లోని డొంక కదిలిందన్నారు. నాసిరకం విద్యా కానుక కిట్లు సరఫరా చేసి ముడుపులు దండుకుంటున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ఐదు కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు చేసి ఆ కంపెనీలకే విద్యాకానుక కిట్లు టెండర్లు కట్టబెట్టారన్నారు. రూ. 1050 కోట్ల టెండరును ఆ సిండికేట్‌కు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఈ సిండికేట్ కంపెనీల్లోనే రూ. 120 కోట్లు దారి మళ్లినట్టు ఈడీ సోదాల్లో వెల్లడైందన్నారు. ఇప్పటి వరకు రూ. 2400 కోట్లు జగనన్న విద్యా కానుక నిమిత్తం ఖర్చు పెట్టారన్నారు. స్కూళ్లల్లో పిల్లలు 38 లక్షల మంది ఉంటే.. 42 లక్షల విద్యార్థులకు కిట్ల పంపిణీ నిమిత్తం కొనుగోలు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. పేద విద్యార్థులను వారి కుటుంబాలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.జగన్ ప్రభుత్వం ఇసుకలోనో.. లిక్కరులోనో అవినీతి చేశారని అంతా భావిస్తున్నారన్నారు. కానీ ప్రతి స్కీంలోనూ ఈ ప్రభుత్వం అవినీతినే చూస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement