Wednesday, May 1, 2024

ఎక్కడవేసిన గొంగలి అక్కడే.. జిల్లాలో జగనన్న ఇంటి నిర్మాణాలకు వీడని గ్రహణం..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా లే-అవుట్లలో నీరు, విద్యుత్‌ వంటి మౌళిక వసతులు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. గ్రౌండింగ్‌ మేళ పేరుతో ఇంటి నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెచ్చిన అధికారులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి. పలు లే అవుట్లలో బోర్లు వేసినా వినియోగంలోకి తేలేదు. లబ్ధిదారులు ట్యాంకర్లలో నీటిని తెచ్చుకొని డ్రమ్ముల్లో నీటిని నింపుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి. విద్యుత్‌ సౌకర్యం లేక జనరేటర్లు అద్దెకు తీసుకొని పనులు చేపడుతున్నారు. లే-అవుట్లలో బోరు బావులు తవ్వించాల్సిన బాధ్యత గ్రామాల్లో గ్రామీణ నీటిపారుధల శాఖ విభాగంది. ఇదే పట్టణాలో అయితే ప్రజా ఆరోగ్యశాఖకు అప్పగించారు. అన్నిచోట్ల వేశామని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. చాలామంది ట్యాంకర్లకు రూ. 500, రూ. 1,000 ఖర్చు పెట్టి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో లే అవుట్లకు రహాదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

దీంతో నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడానికి వాహనదారులు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల తాత్కాలిక రహదారులు నిర్మించి వదిలేశారు. విద్యుత్‌ లైన్లు వేశాం. విద్యుత్‌ సరఫరా ఉందని అధికారులు వెల్లడిస్తున్న వాస్తవ పరిస్థితులు ఇందుకు బిన్నంగా ఉన్నాయి. చాలాచోట్ల ఉప విద్యుత్‌ కేంద్రాలే నిర్మించలేదు. మరికొన్ని చోట్ల లే అవుట్లు నివాసానికి అనువుగా లేకపోవడం, ఊరికి దూరంగా కేటాయించడంతో లబ్ధిదారులు అసక్తిచూపడం లేదు.

మొత్తంగా జగనన్న ఇంటి నిర్మాణ మొఘా మేళ కింద జిల్లాలో 55వేల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు జిల్లాలో 54వేల ఇళ్లు పునాదులు దాటలేదు. ఇక బేస్‌మెంట్‌ కింద 4459 ఇళ్లు ఉండగా, రెంటల్‌ లెవల్‌ 1255, రూఫ్‌స్థాయిలో 130 ఇళ్లు ఉండటం గమనార్హం. ఇక అధికారులు అయితే ఆవైపు కన్నేత్తి చూడటం లేదు. గ్రామ శివార్లలో కాలనీలను ఏర్పాటు చేయడం వల్ల ఇళ్లను కట్టుకునేందుకు లబ్ధిదారులు అసక్తి చూపడం లేదు.ఇక కర్నూలు నగరంలో చాలాచోట్ల లబ్ధిదారులకు అందజేసిన భూములు వివాస్పదంగా ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. చాలవరకు కోర్టుల్లో వివాద స్పద భూములను కేటాయించారని రమేశ్‌యాదవ్‌ అనే లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement