Sunday, April 28, 2024

క‌రోనా క‌ష్ట కాలంలో ఆప‌న్న హ‌స్తాలే నేస్తాలు…

దేశంలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. వ్యవస్థలు స్తంభిస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలు ఉపాధి కోల్పోతున్నారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు గండిపడింది. విద్యాధికులు ఇంతవరకు ప్రైవేటు రంగంలో అధ్యాపకులు, ఇతర వృత్తుల్లో కొనసాగిన పలుపురు ప ళ్ళు, కూరగాయల వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించు కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కళ్ళముందే లక్షల కుటుంబాల పరిస్థితి మారిపోతోంది. ఇప్పుడు వీరందర్నీ ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదు. ప్రభుత్వాల్తో పాటు వధాన్యులు కూడా ముందుకు రావాలి. సమాజంలోని వివిధ వర్గాల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. అన్నిరకాలుగా బాధితులకు చేయూతనివ్వాలి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజువారి నమోదులో అమెరికాను కూడా భారత్‌ మించిపోయింది. ఈ దశలో రోగులకు ఆసుపత్రి సేవలు అత్యవసరమౌతున్నాయి. కాగా పలు ఆసుపత్రులు ఈ పరిస్థితిని తమ ఆర్ధిక ప్రయోజనాలకనుగుణంగా మలచుకుంటు న్నాయి. వీలైనంతగా రోగుల్నుంచి దోచుకుంటున్నాయి. ఇది వైద్య ప్రమాణాలకు, నిబంధనలకు తీవ్ర వ్యతిరేకం. వైద్యులు, ఆసుపత్రులు మానవతాదృక్పధంతో వ్యవహరించాలి. రోగుల పట్ల కనికరం చూపాలి. వారి ప్రాణాల పరిరక్షణ కు ప్రాధాన్యతనివ్వాలి. వీలైనంత మందిని రక్షించామన్న సంతృప్తి పొందే లక్ష్యాన్ని విధించుకో వాలి. ప్రభుత్వాసుపత్రుల్లోని మంచాలు, సేవలు సరిపోవడం లేదు. ఇప్పుడు కరోనాపై పోరాటంలో ప్రైవేటు వైద్య శాలల పాత్ర కీలకమైంది. దీన్ని అందొచ్చిన అవకాశంగా వైద్యులు భావించకూడదు. వృత్తి నిబద్దతకు కట్టుబడాలి. విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం చేసిన ప్రతిజ్ఞల్ని గుర్తు తెచ్చుకోవాలి.
సమాజం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉదారంగా వ్యవహరిం చాలి. గతంలోలా మార్కెట్‌లో బేరాలు సరికాదు. గతంలో వ్యాపారులు మాత్రమే వీధుల్లో అమ్మకాలు జరిపేవారు. కాగా ఇప్పుడు అమ్మకాలకొస్తున్న వారిలో అత్యధికులు ఇతర రంగాల్లో ఉద్యోగాలు పోగొట్టుకుని ఉపాధి కొరవడి ఇల్లు గడిచే మార్గాంతరం లేక రోడ్లపై బళ్ళు తోసుకుంటూ, సైకిళ్ళు తొక్కుకుంటూ కూరగాయలు, పళ్ళ వ్యాపారాలకొస్తున్న వారేనని గుర్తించాలి. వీరి పట్ల దయతో వ్యవహరించాలి. గీసి గీసి బేరాలాడి వీలైనంత తక్కువ ధరలో సరుకులు కొనాలన్న ఆలోచన ను కనీసం కొన్ని మాసాలైనా విరమించు కోవాలి. అమ్మకందారుడు అతి హీనమైన పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అతనికి నష్టాలు రాకుండా వీలైతే రూపాయి లాభం కలిగేలా ఐదో పదో అదనంగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. అలాగే ఉపాధి కల్పనా సంస్థలన్నీ తమ సిబ్బంది, కార్మికుల బాధ్యతల్ని చేపట్టాలి. ప్రస్తుతం వ్యాపారాలు, పరిశ్రమలు బందైన ప్పటికీ వారికి జీతభత్యాలు యదావిధిగా చెల్లించి ఆదుకోవాలి. అలాగే వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య బాధ్యతను కూడా తలకెత్తుకోవాలి. మానవతా ద ృక్పధంతో సిబ్బంది, ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలకు ఆర్ధికంగా సహకరించాలి.
అలాగే ఉపాధి కొరవడి ఉద్యోగాల్లేక.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో ఇప్పటికే లక్షల కుటుంబాలు ఆకలితో అలమటిస్తు న్నాయి. వీరందరి ఆకలి తీర్చేందుకు సమాజం ముందుకు రావాలి. వీలైనంతమందికి ఆహారాన్నందించే ప్రయత్నం చేయాలి. గతంలో కరవు కాటకాలు, యుద్దాల సమయంలో గంజి అన్నం కేంద్రాల్ని ప్రభుత్వాలు నెలకొల్పేవి. వీటికనుబం ధంగా జమిందార్లు, ఆర్ధిక స్థితిపరులు, ప్రైవేటు వ్యాపార, పారిశ్రామిక సంస్థలు సామాజిక సేవా సంస్థలు కూడా ఇలాంటి కేంద్రాల్ని నెలకొల్పి వీలైనంత మంది ఆకలితీర్చేవి. గతంలోనే దేశం అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. యుద్దాల్నుంచి క్షామాల వరకు దేశం చవిచూసింది. ఈ సందర్భాల్లో లక్షలాదిమంది ఆకలితో సతమతమయ్యేవారు. కానీ సమాజం వార్ని ఉదారంగా ఆదుకునేది. వారి కనీస అవసరాల్ని తీర్చేది. స్వతంత్ర సమర కాలంలో అప్పటి బ్రిటీష్‌ సైనికులు, పోలీసుల దాడుల్నుంచి తప్పించుకు తిరిగే సమరయోధులకు సాధారణ ప్రజలెవరైనా సరే వసతి కల్పించేవారు. వారు సైన్యం దృష్టిలో పడకుండా రక్షించేవారు. వారికి ఆహా రాన్నందించేవారు. తమ కోసం ఉద్యమిస్తున్న పోరాట యోధులకు అండగా నిలబడేవారు. ప్రతి ఒక్కరు నేరుగా యుద్ద క్షేత్రంలోకెళ్ళలేరు. కానీ యుద్దం చేయడమొక్కటే ముఖ్యం కాదు. కానీ చేసేవారికి వెన్నుదన్నుగా నిలబడి సేవలందించే వర్గాలు కూడా యుద్దంలో పాల్గొన్న స్థాయిలోనే గుర్తింపు పొందుతారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యత. అలాగే రోగులకు లాభాపేక్షలేని వైద్య సేవలందించడం డాక్టర్ల విధి అని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement