Thursday, May 9, 2024

Delhi: వరికెపూడిశెల ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వండి.. కేంద్రమంత్రికి అంబటి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పల్నాడు ప్రాంతానికి పెద్దమొత్తంలో నీటిని అందించగల వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపిందర్‌ యాదవ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. ఈ మేరకు వారు కేంద్రమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గంగలగుంట గ్రామ సమీపంలో నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ ముందు ఉన్న నది ప్రాంతాన్ని అనేక అధ్యాయల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించినట్టు వివరించారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ ముందు ఒడ్డున ఉన్న స్థలం, ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ప్రతిపాదిత జాక్‌వెల్‌ పంప్‌ హౌస్‌కు నది నీటి ప్రవాహం 10 మీటర్ల వద్ద ఉందని తెలిపారు. పంట కాలంలో తగినంత నీరు అందుబాటులో ఉండేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

ప్రతిపాదిత ప్రాజెక్టు కింద పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి, ఉప్పలపాడు, గంగలకుంట, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదిలవీడు లోయపల్లి, గ్రామాల్లో 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగులు పడతాయని, ఇందుకు సహకరించాలని అంబటి రాంబాబు కేంద్రమంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement