Sunday, May 19, 2024

చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా: రైతు ఆవేదన

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన రైతు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన ఇంటికి వెళ్లే రోడ్డు స్థలం తమదేనని.. దాన్ని ఇప్పించాలని సింగంశెట్టి శ్రీనివాసరావు అనే రైతు తాడేపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌కు దారి లేదన్నారు. అయితే, ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్‌లు.. తనకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారని శ్రీనివాసరావు తెలిపారు.

తన దగ్గర నుంచి తీసుకున్న ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్‌ వేశారని చెప్పాడు. అయితే ఈ స్థలానికి సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి డబ్బులు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామన్నారు. తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే.. తమకు కమీషన్‌ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలం అయినా తమకు అప్పగించాలని.. లేకపోతే డబ్బులైనా ఇవ్వాలని కోరారు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement