Thursday, May 2, 2024

AP | 3 నుంచి పరీక్షలు, 14 నుంచి దసరా సెలవులు..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 14 నుంచి 24 వరకు దసరా సెలవుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి.

ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు.

ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్‌లైన్‌ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement