Friday, April 26, 2024

విద్య, వైద్యం, సంక్షేమమే మా రాష్ట్ర ప్రాధాన్యతలు.. ప్రీ-బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వరకు తిరిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవంలో అది 32 శాతాన్ని మించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. శుక్రవారం ఢిల్లీలోని మానిక్ షా సెంటర్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు దక్కుతున్న వాటాలో కోతల గురించి కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై బుగ్గన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య, వైద్యం, సామాన్య ప్రజలకు అండగా ఉండడంమే తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యతాంశాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆ అంశాలపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఇతోధికంగా అదనపు సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని, నాణ్యమైన మానవ వనరులు తయారవుతున్నాయని వెల్లడించారని తెలిసింది.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని బుగ్గన కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేశారు. మూలధన వ్యయంపై ఇచ్చే స్వల్పకాలిక రుణాలను వచ్చే ఏడాదికి కూడా పొడిగించాలన్న ప్రతిపాదనను సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర,రాయలసీమ సుజన  సవ్రంతికి నిధులు ఇవ్వాలని కోరినట్లు మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గృహ నిర్మాణాలకు నిధులిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర భాగస్వామ్యం లేనందున ఈ అంశాన్ని కూడా పీఎంఏవైలో చేర్చాలని సూచించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పోలవరం, సుజల స్రవంతి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి మరింత దృష్టి పెట్టి కేంద్రం సహకరించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం తోడ్పాటునందించే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడంలో కేంద్రం చొరవతీసుకోవాలని కోరామన్నారు. యువతకు ఉపాధి అందించే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిలో కేంద్రం మరింత సహకరించాలని మంత్రి కోరారు.

రాష్ట్రాల ద్వారా 62 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే, రాష్ట్రాలు అంతే మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నందున జీఎస్టీ వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement