Wednesday, May 1, 2024

వసూల్ రాజా సజ్జల సిగ్గులేకుండా అబద్ధాలాడుతున్నాడు – ధూళిపాళ్ల నరేంద్రకుమార్

గుంటూరు – స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై జగన్ రెడ్డి తరుపున పనిచేసే వసూల్ రాజా సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నాడని, 2013లో గుజరాత్ లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం, సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయని, అలానే ఝార్ఖండ్, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అదేవిధమైన ఒప్పందాలు చేసుకున్నాకే టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో అమలుచేసేందుకు సిద్ధమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం..!

“ వసూల్ రాజా సజ్జల స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలపై వక్రభాష్యాలు చెబుతున్నాడు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమ కు సంబంధంలేదని సజ్జల చెప్పడం హాస్యాస్పదం. సీమెన్స్ సంస్థ కు ఒప్పందంతో సంబంధం లేనప్పుడు, ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం తాలూకా సొమ్ముని ఎందుకు సదరు సంస్థ జమాఖర్చుల్లో చూపిందో సజ్జల చెప్పాలి. ఒప్పందం ద్వారా వచ్చిన డబ్బుని సంస్థ లాభాల్లో చూపినవారు, ఒప్పందంతో తమకు సంబంధంలేదని సదరు సంస్థ చెప్పడం వెనకున్న కుట్రను అర్థంచేసుకోలేని వారెవరూ లేరని సజ్జల తెలుసుకుంటే మంచిది.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే ప్రాజెక్ట్ కోసం కేటాయించిన రూ.370కోట్లు ఎటుపోయాయో సజ్జలకు బోధప డుతుంది జగన్ రెడ్డి సర్కార్ సీమెన్స్ సంస్థ యాజమాన్యాన్ని భయపెట్టి, వారినుంచి ఒప్పందం తో తమకు సంబంధంలేదన్నట్టు రాయించి తప్పుడు అఫిడవిట్ తీసుకొచ్చిందనేది పచ్చినిజం. సజ్జల చెబుతున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ యోగేష్ గుప్తా అనే వ్యక్తి, ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామికాడు. అతనికి ఒప్పందానికి ఎలాంటి సంబంధంలేదు. డేటా ఎంట్రీ ఆపరేట ర్లను బెదిరించి, వారితో చంద్రబాబు పేరు చెప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత తప్పుచేసినట్టు కాదు. సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థ సహా, ఒప్పందంలోని వివరాలు. వ్యక్తులు తనకు తెలియదని అదే యోగేశ్ గుప్తా ఈడీ విచారించిన పీ.ఎం.ఎల్.ఏ కేసులో సెక్షన్ – 56 కింద వాంగ్మూలం ఇచ్చింది వాస్తవం. ఈ విషయం వసూల్ రాజా సజ్జల ఎందుకు చెప్పడు? రూ.370 కోట్లు ఎటోపోయాయంటున్న సజ్జల మాటలు అతని అజ్ఞానాన్ని , అసమర్థతను సూచిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.370కోట్లు ఎటుపోయాయో సదరు ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే వారే సమాధానం చెబుతారు. శిక్షణార్ధుల వద్దకెళ్లి చంద్రబాబు తప్పుచేశాడు..మీరు ఆ తప్పులో భాగస్వాములని చెప్పే ధైర్యం సజ్జలకు, అతని ప్రభుత్వానికి ఉందా?

- Advertisement -

చంద్రబాబుకు చూపించని పత్రాలు, వాటిలోని సమాచారం బ్లూమీడియా, అవినీతిమీడియాలో ఎలా వస్తుందో సజ్జల చెప్పాలి
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏజెన్సీకి, ఒప్పందం చేసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సంబంధంలేకపోతే, సిట్ అధిపతిగా ఉన్న రఘురామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి వెళ్లాడో సజ్జల చెప్పాలి. ప్రతి కేసులో ఆయనే వెళ్తున్నాడా.. రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల అరెస్టుల కోసం స్వయంగా డీజీపీనే వెళ్తున్నాడా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణంచెప్పి సంబంధిత పత్రాలు చూపమని చంద్రబాబు అడిగితే, ఆయనకు ఇవ్వని పత్రాల సమాచారం జగన్ రెడ్డికి వంత పాడే బ్లూమీడియాలో ఎలా వస్తోందో కూడా సజ్జల సమాధానం చెప్పాలి. సీఐడీ, సిట్ వద్ద ఉండాల్సిన సమాచారం బ్లూమీడియా, అవినీతి మీడియాకు ఎలా వెళ్లింది? జీఎస్టీ కేసుని ఉదహరించిన సజ్జల, వైసీపీ ఎంపీలు, వారికి చెందిన సంస్థలు చేసిన తప్పుడు జీఎస్టీ క్లెయిమ్ ల గురించి ఎందుకు మాట్లాడడు? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా జరిగిన ఒప్పందంలో ఉన్న కంపెనీలకు, సజ్జల చెబుతున్న జీఎస్టీ కేసుకు ఎలాంటి సంబంధంలేదు? సంబంధంలేని సంస్థలకు చెందిన జీఎస్టీ కేసుని వసూల్ రాజా అతి తెలివితో చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుపై టీడీపీప్రభుత్వం వేసిన కమిటీల్లోని అధికారుల్ని ఏపీ సీఐడీ, సిట్ లు ఎందుకు విచారించలేదో సజ్జల చెప్పాలి.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు, సాధాసాధ్యాలు పరిశీలించమని అప్పటి టీడీపీ ప్రభుత్వం కొందరు అధికారులతో రెండు కమిటీలు వేసింది. ఆయా కమిటీల్లోని అధికా రుల్ని విచారించకుండా, వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం చంద్రబాబు ఒక్కడిదే తప్పని జగన్ సర్కారు ఎలా నిర్ణయిస్తుందో, చంద్రబాబు తప్పుచేశాడని వసూల్ రాజా సజ్జల ఎలా చెబుతున్నాడో స్పష్టం చేయాలి. సీఐడీ ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తులు, ఖాతాలు సీజ్ చేస్తే, హైకోర్టుసహా కింది కోర్టులు సదరు ఖాతాలు, ఆస్తుల్ని వదిలేయా లని చెప్పింది నిజంకాదా? సుప్రీంకోర్టు కూడా కిందికోర్టుల ఆదేశాలను సమర్థించింది నిజంకాదా? సీఐడీ సీజ్ చేసిన డిజైన్ టెక్ ఖాతాల్లో దేశస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు, దేశరక్షణలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు రకరకాల వ్యాపారాలు చేసిన సొమ్ము అని నిర్ధారణ అయ్యాకే న్యాయస్థానాలు ఖాతాల ల సీజ్ ను తప్పుపట్టాయి. ఇవన్నీ తెలిసి కావాలనే సజ్జల టీడీపీపై, చంద్రబాబుపై నిస్సిగ్గుగా బురదజల్లుడు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు.

నోటీసు ఇస్తే సమాధానం చెప్పే విషయానికి చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిన పనేమిటి?

జగన్ రెడ్డిలానే చంద్రబాబు కూడా అవినీతిపరుడని సజ్జలకు అనిపిస్తున్నట్టు ఉంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, తప్పులు, నేరాలుఘోరాలు చేసే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి.. చంద్రబాబు తప్పు చేశాడంటున్నారు. వసూల్ రాజా అవాస్తవాలు, అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికే మీడియాముందుకొచ్చి తప్పుడు ప్రచారం చేశాడు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి, చంద్రబాబు..లోకేశ్ లకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే దొంగప్రభుత్వం టీడీపీ అధినేతను అరెస్ట్ చేసింది. ఆధారాలు అన్నీ ఉన్నప్పుడు అవిచూపించి, చంద్రబాబుకి ఒక నోటీసు ఇచ్చి ఉంటే, ఆయనే కోర్టులకు సమాధానం చెప్పుకునేవారు. అది చేయకుండా హడావిడిగా ఆయనుండే ప్రాంతానికి వెళ్లి, అర్థరాత్రి అరెస్ట్ పేరుతో డ్రామాలు ఎందుకు నడిపారో సజ్జల చెప్పాలి. డీఐజీ రఘురామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అధికారి కాదు.. ముమ్మాటికీ జగన్ రెడ్డి చెంచానే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీప్రభుత్వం విచారించిన సుమన్ బోస్ ఇప్పటికీ దేశంలోనే ఉన్నారు. ఆయనతోపాటు అరెస్ట్ కాబడి, వైసీపీ ప్రభుత్వ తప్పు డు కేసుల విచారణకు హాజరై, బెయిల్ పొందిన వారెవరూ దేశం విడిచి వెళ్లలేదు. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వమే అలా వెళ్లారని దుష్ప్రచారం చేస్తోంది.” అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement