Sunday, May 5, 2024

KNL: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

కోసిగి, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్) : మండల కేంద్రమైన కోసిగిలో ఒక గుర్తుతెలియని 30 సంవత్సరాల వయస్సు గల మహిళ ఇవాళ ఉదయం అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కోసిగి రైల్వేస్టేషన్ కు సమీపంలో గల రామ దేవాలయం, గుడి వెనక భాగాన, రైల్వే పట్టాలపై ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వేగంగా వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయి అక్కడికక్కడే చనిపోయింది. మహిళ రైలు కింద పడుతుండడం గమనించిన రైలు డ్రైవర్, సిబ్బంది రైలును నిలబెట్టి పై అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ముందుకు సాగారు.. ఇంతకి ఈ మహిళ ఎవరు? కోసిగి గ్రామ వాసినా, లేక వేరే ప్రాంతానికి చెందిన మహిళనా అంటూ కొంతసేపు కోసిగి గ్రామస్తులు తలలు పట్టుకున్నారు.

ఇంతకీ ఈ మహిళ ఎవరన్నది, ఏప్రాంత వాసి అన్నది పోలీసుల విచారణలో తెలియవలసి ఉంది. అలాగే మహిళ అంత దారుణంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా తెలియవలసి ఉంది. అనంతరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసికొని ముక్కలు ముక్కలైన మహిళ శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ఈ సంఘటన కోసిగి పట్టణం సెంటర్ లో జరగడంతో ప్రజలు మృతదేహాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement