Tuesday, May 21, 2024

పాఠ‌శాలే పాన‌శాల‌….ఓ గురువు ఘ‌న‌కార్యం..

చిత్తూరు – పిల్లలకు మంచి చెడ్డలను నేర్పించేది గురువు. అలాంటి గురువే గుణం మరిచి అడ్డదారులు తొక్కితే ఇక‌ ఆ విద్యార్థులు పరిస్థితి ఏంటో చెప్పనవసరం లేదు. పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలితే ఇంకేం ఉంది…!! వివరాల్లోకి వెళ్తే …చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల ను పానాశాల‌గా మార్చేశాడు ఆ పాఠ‌శాల ఉపాధ్యాయుడు శ్రీధర్. పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నాడు. ఇదేం నిర్వాకం అంటూ అడిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా దూషించాడు.. ఇదే స‌మ‌యంలో ఆ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను అంటూ బరితెగించి ప్రవర్తించాడు. ఈ ఉపాధ్యాయుడి నిర్వాకుల గురించి విద్యార్థులు చెబుతూ శ్రీధర్ సార్ పాఠశాలలో విద్య బోధన సమయంలో కూడా మద్యం సేవిస్తూ, విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఒళ్ళు గగుర్లు పొడిచేలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడు అని చెప్పారు. విద్యార్థులు చేసే చిన్న చిన్న తప్పులకు బెత్తంతో కొట్టడం ,ఆడపిల్లలను బట్టలు విప్పించి తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అనుమానిస్తున్నట్లు చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పించిన వలసిన ఉపాధ్యాయులే రేపటి తరాల భవిష్యత్ అయిన విద్యార్థుల అబాసుపాలు చేయడం అధికారులకు రాజకీయ నాయకులకు కనిపించడం లేదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి టీచర్ ఉన్న పాఠశాలకు త‌మ‌ పిల్లలను పంపబోము అంటూ విద్యార్థులను ఇంటికే పరిమితం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement