Thursday, May 2, 2024

Big Story | రూటు మార్చిన చంద్రబాబు.. అక్కడే మకాం వేసేందుకు ప్లాన్​!

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ ఎక్కుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు స్పీడును పెంచాయి. ఏ చిన్న అంశాన్ని వదలకుండా కూడా రాజకీయ లబ్దికోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తన స్పీడును మరింత పెంచారు. ఇక పూర్తిస్థాయిలో అమరావతిలో మకాం వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏపి తో పాటు తెలంగాణ లో కూడా రాజకీయంగా దూకుడు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ను సిద్దంచేస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్న తన డెయిలీ షెడ్యూల్‌ మార్పులు చేసుకుందేకు రెడీ అవుతున్నారు. అమరావతిలో నే ఉండి పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇప్పటి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే చంద్రబాబు అమరావతి కేంద్రంగా అందుబాటులో ఉంటున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు నేతలకు అందుబాటులో ఉంటూనే మరో వైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక పై నిత్యం నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు తెలంగాణా ఎన్నికల షెడ్యూల్‌ మరో రెండు నెలల్లోనే వెలువడే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అక్కడ షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో ముందస్తుగా జరిగినా సిద్ధంగా ఉండేలా చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పుడు పార్టీ కార్యకలాపాలపై చంద్రబాబు నిత్యం పర్యవేక్షణ చేసేలా సన్నాహాలు చేసుకుంటు-న్నారు. ఇప్పటికే చంద్రబాబు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ముఖ్య నేతలతో పాటు- పార్టీ కేంద్రం కార్యాలయాల సిబ్బందికి ఇచ్చినట్లు- తెలుస్తోంది.

వరుస భేటిలకు ప్లాన్‌…
పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు.త్వరలో నియోజక వర్గాల సమీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు- చేస్తున్నారు.కీలకమైన నేతలను వ్యక్తిగతంగా భేటి అవ్వడం తో పాటు- నియోజక వర్గాల లోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటివరకు -టె-లీ కాన్ఫరెన్స్‌ ల ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఆయన ఇక పై నేతలతో స్వయంగా మాట్లాడి స్ధానిక పరిస్థితులను తెలుసుకోనున్నారు.

నెలలో రెండు జిల్లాల పర్యటన…
ఇక పై ప్రతినెల రెండు జిల్లాల్లో పర్యటించి సభలు,సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు- చేసుకుంటు-న్నారు.ఓ వైపున యువనేత నారా లోకేష్‌ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కు శ్రీకారం చుట్టి ఇప్పటికే పలు జిల్లాలను టచ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో మహానాడు వేదికగా ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ- మినీ మేనిఫెస్టో పై నేతల బస్సు యాత్రలు జరుగుతున్నాయి. మొత్తం మూడు జోన్‌లుగా విభజించి ఐదు బస్సుల్లో ఈ యాత్రలను నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలో తానుకూడా ఈ యాత్రల్లో పాలుపంచుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెలలో రెండు జిల్లాల పర్యటనకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో,క్యాడర్‌ లో వుంటూ పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement