Sunday, April 28, 2024

Petrol Prices: రూ.5 కాదు రూ.25 తగ్గించాలి: బీజేపీపై ఏపీ మంత్రి పేర్ని ఆగ్రహం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. రాకెట్‌ కంటే వేగంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని హితవు పలికారు. పెట్రోల్ పై రూ.5 కాదు రూ.25 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలన్నారు. సెస్‌ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. బీజేపీ నేతలు ధర్నా చేస్తే తాను కూడా ఢిల్లీ వస్తానని స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచిందన్నారు. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారన్న మంత్రి.. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం బీజేపీ నేతలకు కనిపించలేదా? అని పేర్ని నాని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement