Friday, May 3, 2024

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇప్పట్లో ఇవ్వలేం: ఏపీ ప్రభుత్వం

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే, ఏపీలో మాత్రం 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ కార్యక్రమం జూన్‌ నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.18 ఏళ్లు దాటిన వారంతా టీకా వేయించుకోవడానికి కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని సింఘాల్ తెలిపారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిన్న 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 32,810 ఇంజక్షన్లు ఉన్నట్టు చెప్పారు. 4 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, ఈ వారంలో మరో 50 వేలు వస్తాయని సింఘాల్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement