Friday, April 26, 2024

Big Story | ఇక ఇదే రేటు.. పవన విద్యుత్‌ టారీఫ్‌ నిర్ణయించిన ఏపీఈఆర్సీ

అమరావతి, ఆంధ్రప్రభ : పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్‌ యూనిట్ల నుండి 20 మిలియన్‌ యూనిట్ల మధ్య పవన విద్యుదుత్పత్తి జరుగుతోంది. భవిష్యత్‌లో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలిక పవర్‌ ఎక్సేంజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్ధికంగా కుదేలవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్‌ ధరలను నిర్ణయించింది. యూనిట్‌ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ. 3.48 ఇవ్వాలని విండ్‌ పవర్‌ జనరేట్లు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చింది.

- Advertisement -

ఇరవే ఏళ్ల తరువాత మీ ఇష్టం..

విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుండి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారీఫ్‌ ఇవ్వాలని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఆర్సీ టారీఫ్‌ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆతరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్సీ పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది.

కానీ, ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుండి 20 ఏళ్ల వకూ పవన విద్యుత్‌ టారీఫ్‌ యూనిట్‌కు రూ. 2.64గా నిర్ధారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దుచేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారీఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది.

పవన విద్యుత్‌కు అనుకూలంగా ఏపీ..

కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధికంటే 1.8 శాతం ఎక్కవ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోఫికల్‌ మెటీయోరాలజీ (పుణే) పరిశోధకులు వెల్లడించారు.

కపుల్డ్‌ మెడల్‌ ఇంటర్‌-కంపారిజన్‌ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది ఇసెంబరు నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశ వ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement