Wednesday, May 15, 2024

ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు – ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి హారీష్ రావు..

మెదక్‌ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. వనదుర్గా అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు విశిష్ట హారతితో శ్రీకారం చుట్టారు. అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఉదయం 4 గంటల నుంచే భక్తులను అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏడుపాయలలో మూడు రోజుల పాటు జాతర జరుగడం ఆనవాయితీగా వస్తోంది. తొలిరోజు ఉపవాస దీక్షను ప్రారంభించి భక్తులు.. మరునాడు ఉదయం ఆలయంలో దీక్షను విమరించనున్నారు. శుక్రవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం జరుగనుంది. ఏడుపాయల చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 111 బండ్లు తిరుగనున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు రథోత్సవం జరుగనుంది. జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో నిఘా కోసం సీసీ కెమెరాలు బిగించి, కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు.
ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి హ‌రీష్ రావు..
వేడుకల్లో భాగంగా వన దుర్గ భవానీ అమ్మవారికి నేటి ఉద‌యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీష్ ‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి వనదుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement